సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (మ.1543) దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు.

తుర్కమేనిస్తాన్కు చెందిన ముస్లిం యువకుడు కులీ కుత్బుల్ ముల్క్ కొంతమంది బందువులు, మిత్రులతో కలిసి 16వ శతాబ్దము ప్రారంభములో ఢిల్లీకి వలస వచ్చాడు. ఆ తరువాత దక్షిణాన దక్కన్లో స్థిరపడి బహుమనీ సుల్తాను మహమ్మద్ షా వద్ద పనిచేశాడు. ఈయన 1518లో గోల్కొండను జయించి గోల్కొండ ప్రాంతానికి సామంతుడైనాడు. బహుమనీ సామ్రాజ్య పతనము తరువాత స్వాతంత్ర్యము ప్రకటించుకొని కుతుబ్ షా అనే పట్టం ధరించి, గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేసాడు.

సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు శ్రీ కృష్ణదేవరాయలు మరియు అచ్యుత దేవ రాయలు యొక్క సమకాలికుడు. కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతితో యుద్ధములో ఉండగా సుల్తాన్ కులీ వరంగల్, కొండపల్లి, ఏలూరు మరియు రాజమండ్రి కోటలను ఆక్రమించుకొని తన పాలనను తూర్పుతీరము వరకు విస్తరించాడు. ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. గజపతి నుండి కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్యప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. సుల్తాను సేనలను తిమ్మరుసు కొండవీటి దగ్గర ఓడించడముతో కృష్ణదేవరాయలపై కులీ యొక్క దండయాత్ర ఆగిపోయింది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.