సుభాన్ కులీ కుతుబ్ షా

సుభాన్ కులీ కుతుబ్ షా 1550 లో తన తండ్రి జంషీద్ కులీ కుతుబ్ షా మరణంతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అప్పటికి ఏడు సంవత్సరాల బాలుడు. జంషీద్ కులీ కొలువులో ఒకప్పుడు ప్రముఖ అధికారి అయిన సైఫ్ ఖాన్, సుల్తాను కోపానికి గురై అహ్మద్ నగర్లో తలదాచుకున్నాడు. రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక మేరకు పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదాకా రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్‌గా అహ్మద్‌నగర్ నుండి సైఫ్ ఖాన్‌ను తిరిగి గోల్కొండకు పంపించారు అహ్మద్‌నగర్ సుల్తానులు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు.

సుభాన్ కులీ కుతుబ్‌షా (ఛోటా మాలిక్) సమాధి మందిరం

సుభాన్ కులీ కుతుబ్ షా పట్టాభిషిక్తుడైన అదే సంవత్సరము మరణించాడు. సుభాన్ మరణించిన తర్వాత జరిగిన రాజకీయాల్లో నాయకవారీల సహాయంతో ఆయన పినతండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా సింహాసనమెక్కాడు.

ఛోటామాలిక్ గా వ్యవహరించబడిన సుభాన్ కులీ సమాధి మందిరం, తన తాత కులీ కుతుబ్ సమాధి మందిరం పక్కనే ఒకే మండపంపై ఉన్నది. ఇతర సమాధి మందిరాలకంటే భిన్నంగా ఈ సమాధి పైన ఉన్న గుమ్మటం నునువుగా కాకుండా నిలువు గీరలలో అలంకరించబడి ఉన్నది. ఈయన తండ్రి సమాధి మందిరం లాగే ఈయన సమాధి మందిరంలో ఎటువంటి శిలాఫలకం ప్రతిష్టించబడలేదు.[1]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.