సందాపురం బిచ్చయ్య

సందాపురం బిచ్చయ్య మహబూబ్ నగర్ జిల్లా, వీపనగండ్ల మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కవి. హిందీ పండితుడిగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు సూక్తి సాగర అను కలం పేరుతో తెలుగులో పద్య, వచన రచనలు చేస్తూ, తెలుగు సాహిత్యాభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం వనపర్తికి సమీపంలోని నాగవరంలో స్థిరపడ్డాడు.

సందాపురం బిచ్చయ్య
జననంసందాపురం బిచ్చయ్య
మహబూబ్ నగర్ జిల్లా, వీపనగండ్ల మండలంలోని వెంకటాంపల్లి గ్రామం
నివాస ప్రాంతంనాగవరం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి
మతంహిందూ

ఉద్యోగ జీవితం

సందాపురం బిచ్చయ్య హిందీ సాహిత్య రత్న ( హిందీ బి.ఇడి.) పూర్తి చేసి, 1971లో హిందీ పండితుడిగా ఉద్యోగంలో చేరాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఉండవెల్లి, శ్రీరంగాపురం, అయ్యవారిపల్లె, వేపూరు, కొత్తకోట, సోలిపురం మొదలగు గ్రామాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు.2000 సంవత్సరంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యి, అప్పటి కలెక్టర్ అనంతరాము నుండి అవార్డును స్వీకరించాడు. ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ పిల్లలచే ఏకపాత్రలు, లఘు నాటికలు వేయించేవాడు. కవిత్వం, కథలు రాయడంలో శిక్షణ ఇచ్చేవాడు.

సాహిత్య కృషి

బిచ్చయ్య తెలుగు భాషలో కథలు, కవితలు, ఏకపాత్రలు, నాటికలు మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇప్పటికి పది పుస్తకాలను ముద్రించాడు. మరికొన్ని రచనలు ముద్రణకు సిద్ధం చేస్తున్నాడు. ఆయన రచనలు పలు పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2000 సంవత్సరంలో చెన్నైకి చెందిన యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ సంస్థ వారు బిచ్చయ్యను జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికచేయగా, అప్పటి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ డాక్టర్ వై.వి. రెడ్డిచే పురస్కారాన్ని అందుకున్నాడు[1]. అనేక సాహిత్య సభల్లో పాల్గొని తెలుగు కవిత్వాన్ని వినిపించాడు.

రచనలు

సూక్తి దీపిక
పశువులా ప్రవర్తిస్తున్న మనిషి మానవత్వం ఉన్న మనిషిగా బతకాలని ప్రబోధిస్తూ చేసిన రచన
జ్ఞాన దీపిక
92 పద్యాలతో, మనిషి ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ చేయబడిన రచన.
మానవుని మనుగడకై ఎత్తుగడ
భగవద్గీత, ఉపనిషత్తుల ఆధారంగా మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి చేయాలో, ఏ పద్ధతులను ఆచరించాలో తెలుపుతూ, పద్య, వచన రూపంలో రాయబడిన రచన.
సూక్తి సాగర తరంగం
315 ఆటవెలది, తేటగీతి పద్యాలతో నీతిని బోధిస్తూ రాయబడింది.
ఆత్మానందం
120 సీస పద్యాలలో రాయబడింది.
శ్రీనృసింహ హరి శతకం
యాదగిరి లక్ష్మినరసింహ స్వామిని సంబోధిస్తూ 120 కందపద్యాలతో రాయబడిన శతకం.
శ్రీరామనాగలింగేశ్వర శతకం
కవి తాను ప్రస్తుతం నివసిస్తున్ననాగవరం ప్రాంతంలోని రామ నాగలింగేశ్వరస్వామి పేరుతో రాసిన శతకం.
శ్రీలక్ష్మినరసింహ స్వామి పాటలు
సత్యసాయి భజన గీతాలు

మూలాలు

  1. హిందీ పండితులు- తెలుగులో రచనలు(భాషాభివృద్ధికి బిచ్చయ్య కృషి),ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకం, పుట-9, తేది.09.10.2014
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.