శ్రీరంగం

శ్రీరంగం (తమిళం: ஸ்ரீரங்கம்), శ్రీరంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులొని తిరుచినాపల్లి (తిరుచ్చి) కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.

శ్రీంరంగం

  ?శ్రీరంగం
తమిళనాడు  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10.87°N 78.68°E / 10.87; 78.68
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 70 మీ (230 అడుగులు)
జిల్లా(లు) తిరుచ్చిరాపల్లి జిల్లా
[[:వర్గం:తిరుచ్చిరాపల్లి జిల్లా గ్రామాలు|గ్రామాలు]]

}} -->

జనాభా 70 (1991 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 620006
• +91-431
• TN-48

శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).[1] ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.[2]. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.

కావేరీనది తీరాన మూడు ప్రసిద్ధ రంగనాధ ఆలయాలున్నాయి. అవి

  1. ఆది రంగడు : మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణం లోని రంగనాధస్వామి మందిరం.
  2. మధ్య రంగడు : శివ సముద్రంలోని రంగనాధస్వామి మందిరం.
  3. అంత్య రంగడు : శ్రీరంగంలోని రంగనాధస్వామి మందిరం.

నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాధ స్వామివారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధ రంగనాధ మందిరం.

ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్) గా భావించే "శ్రీశైలేశ దయాపాత్రం.." అనే శ్లోకాన్ని రంగనాధస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.

వైష్ణవ దివ్యదేశాలు

చోళదేశీయ దివ్యదేశములు

శ్రీ రంగమ్‌

వివరం

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం కైంకర్యం
శ్రీరంగనాధుడు (నంబెరుమాళ్) శ్రీ రంగనాయకి ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి దక్షిణ ముఖము భుజంగ శయనము ఆళ్వార్ ప్రణవాకార విమానము ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు తిరుప్పాణి ఆళ్వార్

ఉత్సవాలు

శ్రీరంగనాథుడికి మకరం పునర్వసు; కుంభం శుద్ధ ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి చివరి దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగుతాయి. ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగుతాయి.

విశేషం

శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.

సాహిత్యం

శ్లో. కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
  చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|
  వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
  దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||

శ్లో. శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:
  శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర:|
  నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
  పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|


శ్లో. కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్|
  సవాసుదేవో రంగేశ: ప్రత్యక్షం పరమం పదమ్||

ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల విశ్వసిస్తారు. మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.

భోగమండపం పుష్ప మండపం త్యాగ మండపం ఙాన మండపం
శ్రీరంగం తిరుపతి కాంచీపురం తిరునారాయణపురం
  • విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరుంచిన 8 క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది.

స్వయం వ్యక్త క్షేత్రములు

1.శ్రీరంగముశ్రీరంగనాదులు
2.శ్రీముష్ణముభూవరహ పెరుమాళ్
3.తిరుమలైతిరువేంగడముడై యాన్
4.తిరునీర్మలైశ్రీరంగనాధన్ (నీర్వణ్ణన్)
5.నైమిశారణ్యందేవరాజన్ (వనరూపి)
6.పుష్కరమ్పరమపురుషన్ (తీర్దరూపి)
7.బదరికాశ్రమంతిరునారణన్
8.సాలగ్రామంశ్రీమూర్తి

వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపసు చేసాడు. బ్రహ్మ ప్రీతిచెంది తాన ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీ రామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేక పోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసమయానికి సంధ్యాదమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణుని పూజనందుకుంటానని అనుగ్రహించాడు.

ఆలయవిశేషాలు

ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్‌' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగైయార్‌' అని అంటారు.

వివరణ

పెర్యాళ్వార్ తన "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో ఉన్నాయని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చింది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును అభివర్ణించాడు.

శ్రీ పరాశర భట్ట స్తుతి


శ్లో. అబ్జన్యస్త సదాజ్జ మంచితకటీ సంవాది కౌశేయకం
  కించిత్ తాండవ గంధి సంహసనకం నిర్వ్యాజ మందస్మితమ్|
  చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం
  శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||

బంగారు స్థంభాలు

గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశానికి "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.

మొదటి ప్రాకారం

మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి, సేనమొదలియార్ సన్నిధి, పగల్‌పత్తు మండపం, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ గల చిలుకల మండపము నుండి విమానముపై గల పరవాసు దేవులను దర్శించాలి.

రెండవ-ప్రాకారము

ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం (అభ్యర్ధన) జరుగు మండపం. పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇచట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయస్వామి వరములను ప్రసాదించగలిగిన శక్తివంతుడు.

మూడవ ప్రాకారం

ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ వీధిలో గరుత్మంతిని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే ఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపము ఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.

నాల్గవ ప్రాకారము

ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంది. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి ఉంది. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము ఉంది. ఈ ప్రాకారమలో శ్రీరంగ విలాసం ఉంది. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ) అవతరించిన విధము చిత్రించబడి ఉంది.

విజయ స్థంభం

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే ఉన్నాయి.. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే ఉంది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షుడు ప్రయిష్టితమై ఉన్నాడు. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఉంది. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి. ఈ ప్రాకారములోనే ఉన్నాయి.

ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో ఉంది. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.

శేషరాయన్-మండపము

ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుని సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారథి సన్నిధి ఉన్నాయి.

పరివారదేవతలు

ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (రామానుజుల) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (పవిత్రశరీరం తానే అయిన ) ఇది ఒకప్పటి వసంత మండపము. ఇచట ఉడయ వరులు భక్తుల హృదయమున వేంచేసి ఉంటాడని మణవాళ మామునులు అభివర్ణించాడు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి సన్నిధులు ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి ప్రక్కన ఉంది. ప్రతి దినం ఉదయం 9 గంటల సమయంలో స్వామి సన్నిధిలో శాత్తుముఱై సేవ జరిగుతుంది.ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి, విఠల్ కృష్ణన్, తొండరడిప్పొడియాళ్వార్ ఉన్నాయి.

ఐదవ ప్రాకారము

ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చియార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు. ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి ఉన్నాయి.

ఆరవ ప్రాకారము

ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధులలో ఊరేగుటచేత ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వార్లు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు. ఉత్తర మాడ వీధిలో వేధాంత దేశికర్ సన్నిధి, జగన్నాధన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రథం, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉంది.

ఏడవ ప్రాకారము

ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి ఉంది. వెళియాండాళ్ సన్నిధి కూడా ఉంది. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చును. కుంభమాస (మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి ఉంది. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి ఉంది. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై ఉన్నాయి. పడమటి ద్వారా సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి ఉంది. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.

ఉత్సవాలు

మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడింది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చింది. కుంభమాసమున "శుద్దఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడింది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడింది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.

ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.

నారాయణుని దినచర్య

ఆళ్వారుల వర్ణనలో నారాయణుని దినచర్య.

దినచర్యక్షేత్రం
నిద్రమేల్కొనుటతిరునారాయణపురమున
సుప్రభాతసేవతిరుమలై
స్నానముప్రయాగ
జపముబదరికాశ్రమము
ఆరగింపుపూరీ జగన్నాధము
రాచకార్యముఅయోధ్య
విహారముబృందావనము
శయనముశ్రీరంగము

ఈ స్వామి విషయమై వెలసిన స్తోత్రము అనేకం ఉన్నాయి.

సంఖ్యస్తోత్రంరచయిత
1.స్తోత్ర రత్నముఆళవన్దార్ (యామునా చార్యుల వారు)
2.కాన్తా చతుశ్లోకి(ఆళవన్దార్)

ఇవి కూడా చూడండి

శ్రీరంగనాధస్వామి ఆలయం

మూలాలు

  1. Sri Ranganathaswamy Temple website
  2. India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.