శ్రీమల్లేశ్వరస్వామి మరియు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానము

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామంలో శ్రీమల్లేశ్వరస్వామి మరియు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానము చాలా ప్రసిద్ధి పొందిన పురాతన దేవాలయం.

ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నల్లని రాతి బండలున్న కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు . ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగాన్ని ప్రతిష్టించారు.

మహాశివరాత్రి పర్వదినాన శ్రీమల్లేశ్వరస్వామి మరియు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానము


ఆలయ చరితము

శ్రీలక్ష్మీనరసింహాస్వామి

శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మండ నాయకులైన శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారు హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం ప్రహాల్లాదుని కోరిక మేరకు భక్తులను అనుగ్రహించుటకు అర్చాబింబరూపమున నల్లగొండ్ల గ్రామంలో గల నీలగిరి పర్వతముపై వెలసినారని ప్రతీతి. ఆలయములోగల శిలా శాసనముల ద్వారా శ్రీవారి ఆనంద నిలయ నిర్మాణ వైనము తెలియుచున్నది. ఈ దేవాలయంను పూర్వము జనమేజయుల పాలనలో నిర్మించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు శ్రీవారికి పల్లవు, చోళులు, గజపతులు, విజయనగరరాజులు, మొఘలులు, బ్రిటీష్ వారి కంపెనీపాలనలో కూడా నిత్యధూపదీపనైవేద్య కైంకర్యములతో బ్రహ్మోత్సవములు జరుగుచున్నవి. నేటికి శ్రీవారికి అదృశ్యరూపమున ముని పూజ జరుగుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసము.

గరుడ ముద్దలు

బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణము, వసంతోత్సవము రోజులలో జరిగే కార్యక్రమాలలో గరుడ ముద్దలు పట్టిన నవదంపతులకు సత్ సంతాన సౌభాగ్యం కలుగును.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగింపు చేస్తారు. అన్నదానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.

అంకురారోహణము

బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా పుట్ట మన్నును సేకరించి అందులో విత్తనాలను నాటుతారు ఇదే బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుక.

ధ్వాజారోహణము

అంకురారోహణము కార్యక్రమంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు గరుడ్మంతుని చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణము చేస్తారు, ఈ కార్యక్రమాన్ని ధాజారోహణము అంటారు.

నృసింహజయంతి - హనుమంతసేవ

హనుమంత సేవ రోజున హనుమంతుని వాహనంపై స్వామి వారిని ఊరేగింపు చేస్తారు.

గరుడసేవ

గరుడ సేవ రోజున గరుడ వాహనంపై స్వామి వారిని ఊరేగింపు చేస్తారు.

గజోత్సవము

గజోత్సవం రోజున గజ వాహనంపై అమ్మవార్లను, అశ్వవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

కళ్యాణం

స్వామి వారి కళ్యాణం చేయించిన వారికి అష్టైశ్వర్యాభివృద్ధి కలుగును.

అలకలతోపు

బ్రహ్మోత్సవాలలో జరిగే అలకలతోపు మహోత్సవము యావదాంధ్రప్రదేశ్ లోనే కనీవినీ ఎరుగని రీతిలో జరుగును.

శ్రీ వీరాంజనేయ స్వామి

ఈ క్షేత్ర పాలకుడు శ్రీవీరాంజనేయ స్వామి వారికి సహస్ర నామార్చన (తమలపాకులతో) చేయించిన సకలారిష్టములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందగలరు.

శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నల్లగొండ్ల గ్రామం, వింజమూరు మండలం

శ్రీ గుహమల్లేశ్వర స్వామి

శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయమునకు ఈశాన్య దిశయందు గుహలోపల త్రయంబికా సమేత శ్రీ గుహమల్లేశ్వర స్వామి వెలసిఉన్నారు. శివకేశవులు సమానులే అను ఆర్యోక్తి అనుసరించి శివాయ విష్ణురూపాయ అంటూ ఇది హరిహరక్షేత్రముగా వర్ధిల్లుచున్నది.

ఈ గుహలో స్వయంభువుగా వెలసిన మల్లేశ్వరస్వామి శివలింగంనకు మునులచే నిత్యం పూజలు జరుగుతున్నవని ఈ ప్రాంతవాసుల విశ్వాసం.

ఈ గుహ లోపల మల్లేశ్వరస్వామి శివలింగంతో పాటు రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గాదేవి, అన్నపూర్ణాదేవి మరియు కాళభైరవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి.

ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ గుహలో రాతి బండలు పడగల రూపంలో ఉండుట వలన ఈ గుహను వెయ్యి పడగల గుహగా అభివర్ణిస్తారు.

ఇరుకుగా ఉన్న ఈ గుహలోనికి భక్తులు వెళ్ళేటప్పుడు పడగల కిందుగా తల వంచుకుని వెళ్ళి స్వామి వారిని దర్శించి పూజించుట వలన సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు.

మృత్యుంజయ గుహగా పేరు పొందిన ఈ గుహ లోని శివలింగంపై వర్షపు నీరు, చంద్ర, సూర్య కిరణములు ప్రసరించును. ఈ గుహలోని స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు సర్వపాపములు హరించి అష్టైశ్వర్యములు పొందుదురని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.