శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
| ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం | |
|---|---|
![]() పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం | |
| జననం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జూన్ 4, 1946 కోనేటమ్మపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
| ఇతర పేర్లు | బాలు |
| వృత్తి | నేపధ్య గాయకుడు సంగీత దర్శకుడు నిర్మాత మరియు నటుడు |
| మతం | శైవ బ్రాహ్మణ హిందూ |
| పిల్లలు | చరణ్ & పల్లవి |
| తండ్రి | శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి |
| సంతకం | |
| వెబ్సైటు | |
| http://www.spbindia.com | |
బాల్యము
ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
సినీరంగ ప్రవేశము

మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. 1966లో నటుడు, నిర్మాతా అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు.[1] ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.
విజయ ప్రస్థానం
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి ఉంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.[2]
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయనకు శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేసారు.
నటుడిగా బాలు
నటుడిగా బాలసుబ్రహ్మణ్యం అనేక సినిమాల్లో నటించాడు.
బుల్లితెరపై బాలు
ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచాయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2016 లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

వ్యక్తిత్వం
పురస్కారాలు
| అందుకున్న సంవత్సరము | పురస్కారం | చిత్రము | పాట | భాష | బహూకరించింది |
|---|---|---|---|---|---|
| 2001 | పద్మశ్రీ[3] | భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ | |||
| 1999 | డాక్టరేట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్) [3] |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అప్పటి గవర్నర్ రంగరాజన్ | |||
| 2011 | పద్మభూషణ్ | ||||
| 2016 | శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం | కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు |
బయటి లింకులు
| Wikimedia Commons has media related to S. P. Balasubrahmanyam. |
మూలాలు
- tamilstar వెబ్సైటు నుండి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గురించి వివరాలు జూన్ 04,2008న సేకరించబడినది.
- ఈనాడు దిన పత్రికలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పై వ్యాసం. జూన్ 04,2008న సేకరించబడినది.
- స్వంత వెబ్సైటు నుండి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాల గురించి వివరాలు జూన్ 04,2008న సేకరించబడినది.
