శేషాద్రి రమణ కవులు

శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు.

వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు (1890-1940) మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.[1]

జంటకవులు

వీరు జయంతి రామయ్య పంతులు గార్ని ఉద్యోగం కోసం ఆశ్రయించగా వారు ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున శేషాచార్యులను గుంటూరు జిల్లాలోను, రమణాచార్యులను నిజాం సర్కారులలోను పర్యటించి శాసనాది చారిత్రక సామగ్రిని, తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి నియమించారు. వీరిద్దరు కొంతకాలం తెలుగు చరిత్ర, సాహిత్యానికి తోడ్పడే సామగ్రిని సేకరించి పరిషత్తు భండాగారం నింపారు.

దూపాటి శేషాచార్యులు

శాసన పరిష్కార బాధ్యతలను నిర్వహించిన అనంతరం వీరు బయ్యన్నగూడెం, తిప్పనపల్లె, తుళ్లూరు, వడ్డెపల్లి, ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయం, పునాదిపాడు చివరకు బందరు హిందూ కళాశాలలోను ఉద్యోగం చేశారు.

దూపాటి వేంకట రమణాచార్యులు

వీరు గంపలగూడెం ఆస్థాన పండితులుగాను, బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయంలోను, నందిగామ బోర్డు హైస్కూలులోను పనిచేశారు. తెలంగాణాలో స్థిరపడాలనే కాంక్షతో హనుమకొండ కళాశాలలో సంస్కృతాంధ్ర పండితులుగా 1930 లో నియమితులయ్యారు. వీరు హనుమకొండలో చారిత్రక పరిశోధన మండలిని స్థాపించి 1931లో అఖిల ఆంధ్ర చారిత్రక సమ్మేళనం జరిపి, బాలసముద్రం, మాదిరెడ్డికుంట, కాజీపేట దర్గా శాసనాలు ప్రకటించారు. 1932లో కాకతీయ వర్ధంత్యుత్సవాలలో ప్రముఖ పాత్ర పోషించారు. సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న గోలకొండ కవుల సంచికకు పూర్వకవి పరిచయ పీఠికను ఆయన అందించారు.

ఆతనిని నిర్మల్, కరీంనగరు మొదలగు ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు, వీరు ఆధ్యాత్మిక మార్గాన పయనించి సమర్థ రామదాసస్వామి పద్యకావ్యం రచించారు. 1948లో ఉద్యోగానికి పదవీ విరమణ చేసి రెండేళ్లు ఆంధ్ర విద్యాభివృద్ధిని పాఠశాలలో పనిచేశారు. పిదప కొంతకాలం పురాతత్త్వ శాఖలోను పనిచేసి వందలకొద్దీ శాసనాలు సేకరించి పరిష్కరించారు. చివరిరోజులలో ' పసర ' లో స్వగృహం ఏర్పరచుకొని వ్యవసాయం చేసి 1963లో పరమపదించారు.

రచనలు

చారిత్రక కృతులు

  • ఆంధ్రమంత్రులు
  • ఆంధ్రవీరులు (రెండు భాగాలు - 1929, 1931)
  • రెడ్డికుల నిర్ణయచంద్రిక

చారిత్రక నవలలు

  • కొండపల్లి ముట్టడి
  • వసుంధర

నాటకాలు

  • పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).[2]
  • అర్జున పరాభవం (నాటకం)
  • చంద్రహాస చరిత్ర (1928) [3]
  • మందార మంజరి

పద్యకృతులు

  • మానస బోధామృతము
  • సూర్య శతకము
  • నీతి గీతములు
  • ఋతుసంహారము
  • విక్రమోర్వశీయము
  • నిజాం రాష్ట్ర ప్రశంస
  • సమర్థ రామదాస స్వామి

శతకాలు

  • సూర్య శతకము
  • సర్వలోకేశ్వర శతకము
  • భక్తవత్సల శతకము
  • రామదాస స్వామి శతకము

మూలాలు

  1. శేషాద్రి రమణ కవులు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 837-9.
  2. ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.
  3. చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.