శని

హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' , నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

శనీశ్వరుడు - 1780 కాలానికి చెందిన చిత్రం

శనీశ్వరుడి జననం

శనీశ్వరుని తల్లిదండ్రులు:

సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి, ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.

ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: (शनये क्रमति सः) అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు:

నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం.

ధర్మ రక్షకుడు

ఎద్దు వాహనముపై శని దేవుడు

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.[1]

గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.[2]

శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

శని మహత్యం

శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.[3]

శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే

కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నపుడు శని ప్రస్సనుడవాలంటే:

  1. అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.
  2. విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.
  3. హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలంఅంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట.
  4. శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.
  5. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.
  6. నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.
  7. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి.
  8. కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.
  9. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.
  10. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
  11. శని క్షేత్రాలు సందర్శించాలి.
  12. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
  13. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.
  14. శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.
  15. మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.
  16. శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.
  17. శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.
  18. 'రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.
  19. హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.
  20. పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.
  21. అనాథ బాలలకు అన్నదానం చేయాలి.

పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

శని క్షేత్రాలు

శని శింగణాపూర్

అహమద్ నగర్ జిల్లాలో, షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని "స్వయంభు" (స్వయముగా ఆవిర్భవించిన అని సంస్కృతార్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుం[4] డి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు, గురించి స్తలపురాణం ప్రకారం:

పూర్వం, ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని, ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్ర్హాంతి చెంది, భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్వరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట, ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ, ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల, దోంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్వర స్వామిని, గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును.ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!!!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడి నిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.

శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటింది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

దేవనార్

దేవనారు లోని శని దేవాలయం: ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం (ముంబై-పూణే-బెంగుళూరు) ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద గోవండి, దేవనార్-చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ ప్రామంతానికి అసలు పేరు "దేవనవరు" అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు శనీశ్వర స్వామి: అందమైన, శక్తివంతమైన, గుబురు మీసాలతో కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం గల భక్తులు, లేదా శని మహర్దశ, ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనెను అత్యంత భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికి సమర్పించుకుని, శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.

ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో, పూజారి మహా హారతి ఇచ్చిన వెంటనే, పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా, ఆలయంలో వాతావరణం మారుతుంది. పూనకం అంటే మామూలుగా వుండే అరుపులు, ఆర్భాటలు వుండవు. ఆయన కళ్ళు మూసుకుని తన్మయత్వం లోకి (ట్త్రాన్స్) లోకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్కంటభరిత భరిత వాతావరణాన్ని అక్కడ వున్న ప్రతి ఒక్కరు చూడవచ్చు. అనుభవించవచ్చు. ఆ అలయంలోని మిగతా వారు మెల్లగా 'స్వామి ని నడిపించుకుంటూ ' 'మొనలు తేలిన, పదునైన, పొడవాటి మేకులతో చేయబడిన కుర్చీపై కూర్చో పెడతారు . కాళ్ళు మరియు చేతులు ఆనించే స్తలంలో కూడా ఆ కుర్చీకి పదునైన మేకులు బిగించి ఉంటాయి.

స్వామి శరీరంపైకి శనీశ్వరుడు వచ్చినపుడు, ఆయన ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని దాదాపు ఆరోజు మొత్తం ఆ కుర్చీ పైనే కుర్చుని ఉంటాడు. కొన్ని శనివారాలలో ఆయన 12 నుండి 13 గంటల పాటు ఏకథాటిగా ఆ కుర్చిపైన కూర్చున్నా ఎటువంటి బాధ కాని, అసౌకర్యము గాని ఆయన ముఖంలో కనిపించదు.

అటు తరువాత భక్తులు 'స్వామి' ముందు నిశ్శబ్దముగా కూర్చుంటారు. వారు ఒక జత నిమ్మకాయలు చేతిలో ఉంచుకుని, క్యూలో వారి వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ వుంటారు. స్వామి ఒకరి తరువాత ఒకరిని వంతుల వారిగా తన వద్దకు రమ్మని సైగ చేయుగానే, జనం తమ వద్ద ఉన్న పసుపుపచ్చ నిమ్మకాయల జతను ఆయన ముందు ఉంచుతారు. ఆయన వారి సమస్యలు, వేదనలు లేదా క్షోభ లేదా మరేదైనా సరే వారు చెప్పేది ఓర్పుతో వింటారు. ఆ తరువాత ఆయన వారి వేదన/సమస్య/క్షోభలకు గల కారణాలను విసిదీకరించి వివరిస్తారు.. అది వారి 'ప్రారబ్ధం' కావచ్చు, గతంలో చేసిన కర్మలు (పనులు) ప్రస్తుత జన్మలోనకి మోసుకు రాబడి వుండవచ్చు లేదా స్వామి వివరించినట్టుగా, వారి సమస్యలు ఈ జన్మలోనే అతను (లేదా ఆమె) చేసిన పనులు లేదా కర్మల యొక్క ఫలితం కావచ్చు. కొన్ని సందర్భాలలో అది వారి శత్రువులు లేదా చెడు కోరుకునేవారిచే చేయబడిన వామాచార ప్రయోగం కూడా కారణం కావచ్చు.

ఈ శని దేవాలయ ప్రాంగణములో హనుమంతుడు, జగదీశ్వరుడు, సాయిబాబా, మరియు మాత విగ్రహాలేకాక నవగ్రహ మండపం కూడా ఉంది. గర్భగుడిలో జేష్టాదేవి సమేతుదైన శనీశ్వరస్వామి యొక్క విగ్రహానికి ఎడమవైపున హనుమంతుడు కుడివైపున జగదీశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.

వేదాలలో శని

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.

అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.

చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.

గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.

శని

తొలిసృష్టిలో వేడికి సకలచరాచరముల మలమల మాడిపోవుచున్నప్పుడు బ్రహ్మ సూర్యుని జూచి దేవతలే నీవేడిమి కాగలేకున్నారు; ఇక మానవుల లెక్కయేమి అని అనగా సుర్యునకు కోపము వచ్చెనట అందులకె శని పుట్టెనట అని పరాశరడు చెప్పెను.పురాణములలో చాయా సూర్యుల కుమారుడు శని. ఇతడు నల్లనివాడు.ఇతనికి చాయాసుతుడు, అసితుడు, అసితాంబరుడు అని పేర్లు.

ముంబైలోని శ్రీ శనీశ్వరాలయాలు

నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో శ్రీ శనీశ్వరాలయం

ముంబైలో శ్రీ శనీశ్వర స్వామికి అనేక ఆలయాలు ఉన్నాయి.

  1. దేవనార్ లో ఒక శనీశ్వరాలయం ఉంది
  2. మన్పాడ మార్గంలో దోంబివిలిలో ఒక చక్కని శని దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం 8 గంటలకు శనికి హారతి ఇచ్చి స్తోత్త్రాలు పటిస్తారు.
  3. గాట్కోపర్ (తూర్పు) లో, నాగేశ్వర్ పశర్వంతి జైనమందిరం పక్కన, ఒక శని ఆలయం ఉంది.
  4. కళ్యాణ్ (తూర్పు) లోని కటేమనేవ్లిలో శని మందిరం ఉంది.
  5. కార్ వద్ద సర్వీసు మార్గంలో ఒక శని మందిరం ఉంది.
  6. బోరివలి (తూర్పు) లో గల జాతీయ ఉద్యానవనం దగ్గర శని మందిరం ఉంది.
  7. జోగేశ్వరి (తూర్పు) లో ఉండే ఆలయంలో, ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శని మహాత్మ్యం కథ చదువుతారు.
  8. నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో ఒక శనీశ్వరాలయం ఉంది.
  9. బాందూప్ లో శని మందిరం ఉంది.

ఇతర శని క్షేత్రాలు

శ్రీ శనైశ్చర దేవాలయం మంగళూరు (0824- 2252573) శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ శనైశ్చర దేవాలయంలోని గర్భ గుడిలో గణేశ, దుర్గామాత మరియు శనైశ్చర స్వామి మూర్తులు ప్రతిష్ఠించ బడివున్నాయి.

శనిగ్రహం దీర్ఘాయువు, దుర్భాగ్యము, దుఃఖము, వృద్ధాప్యం మరియు చావు, క్రమశిక్షణ, నియమం, బాధ్యత, కాలయాపనలు, గాఢమైన వాంఛ, నాయకత్వము, అధికారం, నిరాడంబరత, చిత్తశుద్ధి, అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం, కాదనుట, అనురాగం లేకపోవుట, ఆత్మ స్వరూపత్వం, కష్టించి పనిచేయుట, సంవిధానం, వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది. అసమానమైన లక్షణాలు: అపారమైన శక్తి, చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు..

శ్రీ శనీశ్వర కోవెల తిరునల్లార్: పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది. శివుని అవతారమైన దర్బరన్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో, శనీశ్వరుడు, ఒక గోడ గూటిలో కొలు ఉన్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు, శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి భక్తులు ఈ గుడిని దర్శించి, ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి, ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే, శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు, తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు, ఇక్కడి కొలనులో స్నాం చేసి, గుడిలో పూజ చేసిన తరువాత, శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడింది.

శని ధామ్: శనిధామ్, అని పిలువబడే ఈ ఆలయం చత్తర్ పూర్ కు సమీపమంలో, కుతుబ్ మినార్ నుండి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ, 21 అడుగుల ఎత్తుగల అష్టధాతు మరియు ప్రకృతి సిద్ధమైన రాతితో చేయబడిన శననీస్వరుడి నిలువెత్తు విగ్రహం ఉంది. శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే, కాలసర్పం, సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.

వడ తిరునల్లార్ శనీశ్వర కోవెల: చెన్నైలో, మాంబళంలో ఉంది.ఇక్కడ శనీశ్వరుడు, సతీ (జేష్టాదేవిని ఇక్కడ నీలాంబికగా పిలవ బడుతూంది) సమేతుడై వెలిశాడు. విగ్నేశ్వరుడు, దుర్గ మరియు పంచముఖ హనుమాను ఉన్నారు.

'కుచనూరు: మదురై దగ్గరలో, కుచనూరులో శనీశ్వరుడు, స్వయంభు సిందూరం రంగు విగ్రహం. కుబ్జుడు అన్నది, శనీశ్వరుడి నామల్లో ఒకటి. తమిళబాషానుసారంగా కుబ్జన్ ఉన్న ఊరు కుబ్జనూర్, కాలాంతరంలో కుచ్చానూర్ అయింది. తూర్పు ముఖంగా గురుభగవానుడి ఆలయంతో బాటు క్రొత్తగా నిర్మింపబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం ముందుగా కాకులకు సమర్పించి ఆతరువాత భక్తులకు పంచుతారు. ఒకవేళ కాకులు ప్రసాదమున తిరస్కరిస్తే, మళ్ళీ కొత్తగా ప్రసాదం చేసి, శనికి నివేదించి, కాకులకు మళ్ళీసమర్పిస్తారు.

మందపల్లి: తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది.ఈ దేవాలయం మందేశ్వరాలయంగా కూడా ప్రశస్తి పొందినది.మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

మందపల్లి లో శని పూజకు కావలసిన వస్తువులు

  • పసుపు
  • కుంకుమ
  • వత్తులు
  • ప్రమిదులు-2
  • నల్ల నువ్వుల నూనె-1/2 కేజి
  • నల్ల నువ్వులు
  • నవ దాన్యలు-100 గ్రాములు
  • మేకు-1
  • యెర్ర గుడ్డ
  • నల్ల గుడ్డ
  • బియ్యం-1/2 కేజి
  • బెల్లం
  • పువ్వులు
  • తమలపాకులు-10
  • అరటి పండ్లు-4
  • కర్పూరం
  • అగరబత్తి
  • ఒక్కలు-2
  • కొబ్బరికాయలు-2
  • ప్రత్తి గింజలు
  • అరటి ఆకు-1
  • గ్లాసులు-2

పావగడ:మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

  • పాయలేబర్ శనీశ్వర కోవెల సింగపూర్,
  • మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
  • శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
  • శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
  • శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
  • శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
  • శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
  • శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
  • శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
  • శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
  • శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
  • శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, karol bagh, new ఢిల్లీ (near karol bagh hanuman temple).
  • శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
  • శ్రీ శని దేవాలయం, మడివాల, బెంగుళూరు
  • శ్రీ శనైశ్వర దేవాలయం, హాస్సన్
  • శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
  • శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి.
  • శ్రీ శని దేవాలయం, హత్ల, జాంనగర్ జిల్లా, గుజరాత్
  • శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
  • శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెంకి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. (ఇది పురాతన ఆలయము)
  • శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, కన్మంగళ, శ్రీ సత్యసాయి ఆశ్రమం, వైట్ఫీల్డ్, బెంగుళూరు.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, సమేతహళ్లి, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో, బెంగళూరు.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, బస్సు స్టాండ్ దగ్గర.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, కాంగ్ర, హిమాచల్ ప్రదేశ్.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
  • శ్రీ అభయ శనీశ్వర దేవాలయం, రామ్మూర్తినగర్, హైదరాబాద్.
  • శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు.
  • శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాళ్, (ఫ్లైఓవర్ క్రింద) బెంగుళూరు.
  • శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై.
  • శ్రీ శనైశ్కర దేవాలయం - కోరమంగళ, బెంగళూరు.
  • శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్.
  • శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు.

పురాణాలలో శనీశ్వరుడు

శని భగవానుడి జీవిత కథ శ్రీ శనిమహాత్మ్యం ॥श्री शनिमहात्म्यं॥ అనే అతి ప్రాచీన గ్రంథంలో తెలుపబడింది. ఈ గ్రంథంలో శని దేవుడిని ప్రార్తించి, మెప్పించి ఆయన కృపను, ఆశీస్సులు పొందుటకు ఎంత కష్టమో,ఎంతటి భక్తి శ్రద్ధలు అవసరమో వివరించబడింది. శ్రీ శని మహాత్మ్యం ఇతర గ్రహాల యొక్క ప్రాముఖ్యత, వాటి బలాబలాలను గూర్చి వివరిస్తూ ప్రారంభమవుతుంది. మొట్ట మొదటగా ఈ విషయాలను విశ్లేషించిన ఘనత ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆస్థాన పండితులకు దక్కుతుంది.

హనుమంతుడు

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడిని ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన (శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.

దశరథ మహారాజు

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా బాధ్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను. ఈ విషయంలో నీకు ఋష్యశృంగ మహర్షి సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని శని దీవీంచాడట. ఆతరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తె 'శాంత'దేవిని ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు. (ఇది తప్పు- ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకున్నది అంగ రాజ్యాధిపతి రోమపాదుడు. ఆరోజులల్లో ఆ దేశములో కరువుకాటకాలు గురయిన రాజ్యం అంగదేశం. కరువుకాటకాల నివారణకు గాను రోమపాదుడు తన కూతురైన శాంతను విభండక మహర్షి కుమారుడయిన ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు)

జ్యోతిష్యశాస్త్రంలో శని స్థానం

వేదసంబంధమైన జ్యోతిష శాస్త్ర ప్రకారం, శని భగవానుడు నవగ్రహాలలో ఒకడు. శని అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావములు కలుగచేయువానిగా, మరియు సహనము, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా; మరియు ఆంక్షలను, నియమాలను విధించేవాడుగా పరిగణింపబడ్డాడు. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉన్నచో ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయములు సానుకూలముగా ఉండును. నిజానికి, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే ప్రతి హిందూ మతస్థుడు తన జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, ఎందుకనగా మరి ఏ ఇతర 'గ్రహం' అనుకూలమైన స్థానంలో ఉన్నా కుడా శని ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు "ప్రతికూల" స్థానంలో ఉన్న శని, పై విషయములన్నింటిలో సమస్యలు సృష్టించును.

శని ప్రతికూల స్థానములో ఉన్నచో కలిగే "దుష్ఫలితాలు" చాలా తీవ్రముగా ఉండుటచే, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే హిందువులు శని అనగా మిక్కిలి భయపడతారు. ఏమైనప్పటికీ, శని ఒక వ్యక్తి అనుభవించే సుఖాలు లేదా కష్టాలకు కారణభూతుడుగా భావించబడుతున్నాడు, శని "ఉనికి"ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క కర్మ ఫలితాలుగా గుర్తించబడినవి. కావున "ప్రతికూల స్థానం"లో ఉన్న శని ఒక వ్యక్తి యొక్క చెడు కర్మల ఫలితాలకు కారణభూతుడుకాగా, అనుకూల స్థానంలో ఉన్న శని మంచి కర్మల ఫలితాలు కారణభూతుడు ఔతాడు. ఆరోగ్యపరంగా చూస్తే క్షీణత, బిగుసుకుపోవడం, క్షీణించిన రక్త ప్రసరణ, కృశించిపోవడం, మొదలైన అనారోగ్యాలు, సరిగా ఆలోచించలేకపోవుట, అసమత్వ బుద్ధి కలిగుండటం వంటి మానసిక సమస్యలు శని భగవానుని ప్రభావముచే కలుగును. ఈ రోగములన్నీ జాతకచక్రంలో శని ఉపస్థితను అనుసరించి నిర్ణయించబడతాయి.

శని గ్రహం ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించటానికి 30 సంవత్సరాలు పడుతుంది, అనగా ఈ 30 సంవత్సరాలలో ఇది 12 రాశులు లేదా సంపూఋణ సూర్యభ్రమణం చేయుటకు పట్టు కాలం. కావున ప్రతి రాశి లేదా చంద్ర రాశులలో శని భగవానుడు సగటున రెండున్నర సంవత్సరాలు గడుపును. రాశుల గుండా శని యొక్క ఈ ప్రయాణానికి హిందూ జ్యోతిష్యశాస్త్రంలో మరియు భవిష్యత్తును చెప్పుటలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏలిన నాటి శని యొక్క ప్రభావం వారి యొక్క జన్మ రాశికి ముందు రాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమై జన్మరాశి తరువాత రాశిలోనికి ప్రవేశించడంతో ముగుస్తుంది. మొత్తము ఈ 7.5 సంవత్సరాల (2.5 సంవత్సరాలు×3) కాలాన్ని సాడెసాతి లేదా "ఏల్నాటి శని"గా పరిగణిస్తారు, ఇది జీవితంలో అత్యంత కష్ట కాలం. శని మహాదశ లోనికి ప్రవేశించే ముందు ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలు చాల ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో శని రాజును కూడా దరిద్రునిగా మార్చగలడని చెప్పబడింది.

శని మకర (కాప్రికార్న్) మరియు కుంభ (అక్వేరియస్) రాశులను పాలించువాడుగా, తుల (లిబ్రా) లో ఉన్నతమైన వాడుగా మరియు మేషరాశి (ఏరిఎస్) లో నిస్త్రాణుడుగా ఉండును. బుధుడు, శుక్రుడు, రాహు, కేతులు శనికి స్నేహితులుగా, సూర్యుడు, చంద్రుడు మరియు అంగారకుడు శత్రువులుగా పరిగణింపబడ్డారు. గురు లేదా బృహస్పతి శనితో తటస్థ వైఖరిని అవలంబించును. శని పుష్యమి, అనురాధ, మరియు ఉత్తర బాధ్రపద నక్షత్రాల, చంద్రభావనాల అధిపతి.

శని భగవానుని వర్ణన పురాణాలు మరియు జ్యోతిషశాస్త్రంలో ఇలా వర్ణించబడి ఉంటుంది. ఆయన వర్ణం నలుపు లేదా ముదురు నీలం, లోహం ఇనుము మరియు రత్నం నీలం. ఈయన మూలసూత్రం లేదా తత్త్వం వాయువు, దిక్కు పడమర (సూర్యుడు అస్తమించి చీకటి ప్రారంభమయ్యే చోటు) మరియు అన్ని ఋతువులను పాలించును. నువ్వులు, మినుములు, నల్లని ధాన్యాలు శని యొక్క సంప్రదాయ ఆహారపదార్థాలు, ఈయన పుష్పం ఉదారంగు మరియు అన్నీ నల్లని జంతువులు ఇంకా అన్నీ పనికిరాని మరియు అసహ్యమైనవాటిగా పరిగణించబడే వృక్షములతో జోడించబడ్డాడు.

శని సమూహములను పరిపాలించును. వారివారి జాతకాలలో శనిగ్రహం అనుకూల స్థితిలో లేకున్న జన సమూహం పాలించడం అనేది చాలా కష్టం. వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని ప్రాబల్యం (లేదా లగ్నం) ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి జన సమూహమందు మంచి నాయకునిగా గుర్తింపు మరియు కీర్తిని పొందును. అంతేకాక, అటువంటి వ్యక్తులు తమ చేతిలో ఉన్న కార్యము పట్ల మిక్కిలి అంకితభావం మరియు పట్టు కలిగివుంటారని చెప్పబడింది. మరోవైపు, వ్యక్తి జాతకచక్రంలో శని బలహీనునిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి 'కర్మ' బలహీనమై తన బాధ్యతల పట్ల అంకితభావం మరియు పట్టు లేకపోవడంచే బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమగును. అందుచే వ్యక్తి జాతకంలో శనీశ్వరుని దీవెనలు లేనిదే 'మోక్షం' లభించుట కష్టం.

శనీశ్వర భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో కచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.

శని భగవానుడు తన చెడు ప్రభావములకంటే కూడా దీవెనలకు ప్రసిద్ధుడు. దీవెనలు అందించుటలో మరి ఏ ఇతర గ్రహాన్ని శనితో పోల్చలేము. తన దశ చివరిలో ఆయన దీవెనల వర్షం కురిపించును. ప్రజాపతి ఈయన అది-దేవత కాగా యముడు ప్రత్యాది-దేవత. శనిదేవుడు వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించును, చిరాకులను మరియు జాప్యాన్ని కలుగచేయుటచే మన అధర్మమైన పనులను సరిదిద్దును. చివరిలో మనం చేసే తప్పులను తెలుసుకొనే జ్ఞానమును ప్రసాదించును. ఆయన శిక్షించడం ద్వారా అంతరంగములో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టును, జీవి లేదా వ్యక్తి ఆత్మను పరిపూర్ణం చేయుటద్వారా వ్యక్తి లోపలినుండి రాగి నుండి బంగారముగా మారును అనగా అతను జీవిత సత్యాలను, తాను అజ్ఞానముచే చేసిన పనుల నిరర్థకతను అర్థంచేసుకుంటాడు. శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు. ఇదంతా మానవులపై దేవతలు కర్తలుగా, పవిత్ర స్వరూపం చేయించును.

శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం.సంఖ్యాశాస్త్రం ప్రకారం 8వ సంఖ్యలో జన్మించినవారు శనిదేవునిచే పాలింపబడతారు. ఏ నెలలోనైనా 8, 26 తేదిలలో జన్మించిన వారు జీవితంలో కష్టాలను ఎదుర్కుంటారు అనేది రుజువు చేయబడిన యదార్థం. ఈ కష్టాలకు కారణం ఉంటుంది, ఇంకా ఆ కారణాన్ని వారి జీవిత కాలంలో గుర్తించటం ముఖ్యం. చెడు పనులకు బాధ్యత వహించటం, ఆత్మవిమర్శ మరియు కష్టించి పనిచేయుట వంటివి శనిదేవుని శాంతింపచేయుటకు మార్గాలు. శనివారాలలో నీలపు వస్త్రాన్ని దానం చేయటం మరియు పేదవారిని సేవించటం కూడా సహాయపడును.

ఇవి కూడా చూడండి

నవగ్రహాలు

20వ జైన తీర్థంకరుడు అయిన మునిసువరత్ స్వామి శనీస్వరుని భక్తుడు. ఎవరైతే మునిసువరత్ స్వామిని ప్రార్థిస్తారో వారు శనిదేవుని బారి నుండి రక్షింపబడతారు అని జైనుల నమ్మకం.

బాహ్య లింకులు

సూచనలు

  1. http://books.google.com/books?id=RnzLgxvmOFkC&pg=PA9&dq=shani+karma&cd=2#v=onepage&q=shani%20karma&f=false
  2. మైథాలజి అఫ్ ది హిందూస్ బై చార్లెస్ కొలేమాన్ పి. 134
  3. క్రిషన్, యువరాజ్, గణేశ: ఆన్రావేలింగ్ ఆన్ ఎనిగ్మా (1999) పి. 137. భారతీయ విద్యా భవన్.
  4. పాదసూచిక పాఠ్యాన్ని ఇక్కడ చేర్చండి


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.