వేణుమాధవ్

వేణుమాధవ్
జననంనల్గొండ
నివాసంహైదరాబాదు
వృత్తినటుడు, వెంట్రిలాక్విస్ట్

వేణుమాధవ్ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు.

బాల్యం

ఈయన పుట్టింది నల్గొండలో. పెరిగింది కోదాడ లో. నాన్న టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా కోదాడలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.

ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో బాంబే (ప్రస్తుతం ముంబై) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటి సారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే ఎలిమినేటి మాధవ రెడ్డి కూడా వేణుమాధవ్ ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి చంద్రబాబునాయుడు వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.

ఆ పరిచయంతో వేణుకు హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. అందులో పది కాల్స్ వస్తే తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు.

సినీ ప్రస్థానం

అసెంబ్లీలో పని చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. ఒక సారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళాడు. అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. దాన్ని చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా[1]. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైనవి.

ఎన్టీఆర్ తర్వాత రామోజీరావంటే ఆయనకు గౌరవం, అభిమానం. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి ల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడని ఆయన గట్టి నమ్మకం. అందుకనే ఆయన కట్టుకున్న ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకుని అభిమానం చాటుకున్నాడు.

నటుడిగా

నిర్మాతగా

పురస్కారాలు

  • 2006 లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది బహుమతి

మూలాలు

  1. మే 17, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.