వేటూరి ప్రభాకరశాస్త్రి

వేటూరి ప్రభాకరశాస్త్రి, (ఫిబ్రవరి 7, 1888 - ఆగష్టు 29, 1950) తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు.[1] చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి వ్యక్తి ప్రపంచ సాహితీ చరిత్రకు ప్రకాశము వంటి వారు. ఆయన వట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ! ఆయన వట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఈయన తెలుగుభారతీ సంతానములో చిరస్మరణీయులు, తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు.

వేటూరి ప్రభాకరశాస్త్రి
వేటూరి ప్రభాకరశాస్త్రి
పుట్టిన తేదీ, స్థలంఫిబ్రవరి 7, 1888
పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంఆగష్టు 29, 1950
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం

జీవిత విశేషాలు

ప్రభాకరశాస్త్రి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలములో కృష్ణా నది తీరమున ఉన్న పెదకళ్ళేపల్లిలో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా 1888, ఫిబ్రవరి 7 న అనగా సర్వజిత్ మాఖ బహుళ ఏకాదశి మంగళ వారం ఉదయం జేష్టా నక్షత్రం మిథున లగ్నమున జన్మించారు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి ఆయుర్వేద వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నారు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి చల్లపల్లిలోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.

16 యేళ్ల వయసులో, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి బందరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిసి కొందరు సహాధ్యాయులతో కలిసి అక్కడ చేరాడు. బందర్లో విద్యాభ్యాసము చేస్తున్న కాలములో ఈయన కొండా వెంకటప్పయ్య మరియు వల్లూరి సూర్యనారాయణరావుల ఇంట నివసించాడు. తెలుగులో తనకు తెలిసినదంతా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రితో ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదేనని ఆ తరువాత ప్రభాకరశాస్త్రి చెప్పుకున్నాడు.

ఆ తరువాత తన 19వ యేట మద్రాసు చేరి వెస్లీ మిషన్ హైస్కూలులో తెలుగు పండితునిగా రెండేళ్ళు పనిచేశాడు. ఆ సమయములో మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు వెళ్ళి అక్కడి గ్రంథాలను చదువుతుండేవాడు.

ప్రభాకరశాస్త్రి, తెలుగులో అనేక కావ్యములు రచించడముతో పాటు అనువాదాలు, వివరణా గ్రంథాలు రచించాడు. ఈయన ప్రాచ్యలిఖిత పుస్తకాలయములో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రకాధారములతో సవివరముగా పరిష్కరించి ప్రకటించాడు.

రచనాశైలి, రచనలు [2]

పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనపాఠి.

  • శృంగారశ్రీనాథం
  • క్రీడాభిరామం
  • బసవపురాణం
  • రంగనాథ రామాయణం
  • తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర
  • ప్రాచీనాంధ్ర శాసనములు
  • శాతవాహనులు
  • ఇక్ష్వాకులు
  • రెడ్డిరాజులు
  • చాటుపద్యమణిమంజరి[3]
  • అన్నమాచార్య కీర్తనలు తొలితెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము... ఇవన్నీ, వీరందరూ ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!
  • ధనుర్విద్యా విలాసము (1950)

అనువాద నాటకాలు

శాస్త్రిగారు సంస్కృత రూపకాలను తెలుగులోకి అనువాదం చేశారు. ఇందులో 1910లో ప్రకటించబడిన ప్రతిమ రామాయనానికి, 1913లో ప్రకటితాలైన కర్ణభారం, మధ్యమవ్యాయోగం భారతానికి సంబంధించినవి కాగా మిగిలిన భగవదజ్జుకం, మత్తవిలాసం, నాగానందం ఇతరాలు.[4]

ఇతర విశేషాలు

మూలములు

  1. తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)
  2. వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రంథావళి (తెలుగుపరిశోధన వెబ్ సైట్ లో)
  3. చాటుపద్యమణిమంజరి
  4. వేటూరి వారి అనువాద నాటకాలు, ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు, సప్తగిరి, జూలై 2014 పేజీలు: 31-32.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.