వంశధార

వంశధార నది ఒడిషా రాష్ట్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున పాఱుచున్నది. ఇందులో 150 కిలోమీటర్లు ఒడిషాలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వద్ద మన ఆంధ్రలోనికి వచ్చి కళింగపట్నం అనే చోట బంగాళా ఖాతములో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా వాడుకోబదుతుంది. ఇప్పటిలోన దీనిపై కట్టించఁబడిన ఒకేయొక్క ఆనకట్ట గొట్టా (శ్రీకాకుళం జిల్లా) అను పిలువఁబడు చోటులో ఉంది.

వంశధారానది గుఱించి చెప్పుకొనే ఒక కథ

శ్రీకాకుళం జిల్లాలో పారాఱునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి ఏలుచుండేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే పేరుఁగల పెండ్లము ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ మగనికి ముద్దుఁగా బ్రతిమాలి పిలిఁచి, కూర్చుండబెట్టి, పూజా గదికి పోయి విష్ణువును కొలిఁచి, స్వామీ! అటు నా మొగుఁడును నేను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను కాఁపాడమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని దాలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను వెలఁయింపఁసేసెను. ఆ గంగ గొప్ప ఉఱఁవడి పఱఁవడిఁగా రాగా మహారాజు జడిఁసి పరుగిడి ఒక కొండ మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపేమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.

ఆంధ్రకు అదనపు నీరు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంశధార నదినీరును అదనంగా వాడుకోవడానికని గుఱించిన ప్రాజెక్టు అడ్డంకులను ట్రిబ్యునల్ తొలగించింది. వంశధార నది ఆంధ్ర- ఒడిషా ఎల్లల్లో 29 కిలోమీటర్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో 82 కిలోమీటర్లు పాఱుచున్నది. ఈ రెండు రాష్ట్రాల నడుమ 1962లో కుదిరిన ఒప్పందమునిఁబట్టి వంశధార నీటిని ఇద్దరు, చెఱి సగము (50:50 శాతం) వాడుకోవాలి. ఈ నదిపై కట్టించాల్సిన ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు దశలుగా విడఁగొట్టింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాల వలను కట్టించింది. 17,841 టిఎంసిల నది నీటిని వాడుకుంటోంది. అందు వల్లన 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండో దశలో 16.048 టిఎంసిలతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేరడి ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని కోసం ఒడిషాలోని 106 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుఁదల ఇవ్వనందున ఇంతకాలం జాగు జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పనిని కూడా రెండుగా విడఁదీసి మొదటి దశగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ కట్టించింది. 0.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ముగించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో కాట్రగడ్డ వద్ద సైడ్ వీయర్ కట్టడం చేపట్టి మరో 8 టిఎంసిలను వాడుకోవడానికి వీలుచిక్కింది.

మూలం:See more at: http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.