రుక్మిణీ

రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యలలో ఒక భార్య. ఈమె లక్ష్మీ దేవి అవతారమని హిందువుల నమ్ముకము. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందములో వస్తాయి.

Vithoba (left) with his consort Rakhumai at the Sion Vitthal temple, Mumbai, decorated with jewellery during the Hindu festival of Diwali

రుక్మిణీ కళ్యాణం

రుక్మిణీ కృష్ణుల వివాహ ఘట్టము 1800 సంవత్సరం నాటి హిమాచల్ వర్ణచిత్రము

విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. రుక్మిణీ దేవి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. రుక్మిణి దేవి శరత్కాల చంద్ర బింబం వలే దిన దిన ప్రవర్థమాన మవుతుండేది. కాలము గడుచుచుండగా రుక్మిణీ దేవి యవ్వన వయస్సుకు వస్తుంది.

వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురుంచి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీ దేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్ళి శిశుపాలుడు కిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీ దేవి చాలా చింతిస్తుంది. కొద్ది సేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిజోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిజోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీ దేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు. యదువంశ నందన రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరము పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో యదువంశ నందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలు దేరుతారు. అగ్నిజోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు, శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. రుక్మిణి దేవి ఆ దేవాలయములో ఆమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది.

నమ్మితి నా మనంబున సనాతునులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పె
ద్దమ్మ దయాంబురాశిది గదమ్మ హరింబతిసేయమ్మనిన్
నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ యీశ్వరీ

ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీ దేవిని తీసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీ కృష్ణుడి మీద యుద్ధమునకు బయలు దేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదు వీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచ కన్యని పెళ్ళి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సు ఖండించాడు. మరికొన్ని నిశిత శరాలతో గుఱ్ఱలను చంపాడు. శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.

శ్రీ కృష్ణుడు - రుక్మిణీతో ఛలోక్తాడిన సన్నివేశం

శ్రీకృష్ణ తులాభారం

శీర్షిక పాఠ్యం

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.