రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆంగ్లం: Rashtriya Swayamsevak Sangh) ను సంక్షిప్తంగా ఆర్.యస్.యస్. అంటారు. భారత దేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారు.

విశేషాలు

భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.[1] ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుంది.[2] భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.

ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా) ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని సర్ సంఘ్ చాలక్గా వ్యవహరిస్తారు. 1948లో మహాత్మా గాంధీ హత్యానంతరం, 1975 ఎమర్జెన్సీ సమయంలో మరియు 1992 బాబ్రీ మసీదు విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగింది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థగా అభివర్ణిస్తారు.

ఆర్.యస్.యస్. మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు.

ఈ సంస్థకు 1925 నుండి 1940 వరకు సర్ సంఘ్ చాలక్గా పనిచేసిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్, ఆయన తరువాత 1940 నుండి 1973 వరకు ఆ పదవిలో పనిచేసిన మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ మరియు తదుపరి 1973 నుండి 1993 వరకు ఆ పదవిలో పనిచేసిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ఈ ముగ్గురూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారత దేశమంతటా విస్తరించటానికి ఎనలేని కృషి చేశారు.

ఈ సంస్థ అనేకానేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏవైనా విపత్తులు సంభవించినపుడు పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని నిరుపమానమైన సేవలందిస్తుంది.

ఆర్.ఎస్.ఎస్. అధినేతలుగా పనిచేసివారు

  • 1925 నుండి 1940: కేశవ్ బలిరాం హెడ్గేవార్.
  • 1940 నుండి 1973: గురూజీ గోల్వాల్కర్.
  • 1973 నుండి 1994: బాలాసాహెబ్ దేవరస్.
  • 1994 నుండి 2000: రజ్జూ భయ్యా.
  • 2000 నుండి 2009: సుదర్శన్.
  • 2009 నుండి ప్రస్తుతం వరకు: మోహన్ భగవత్.

ప్రముఖులు

ఆర్.ఎస్.ఎస్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతి గాంచింది.ఇది ముఖ్యంగా సేవ, విద్య పరమైన హిందూజాతీయ వాది స్వచ్ఛందమైన సేవ సంస్థ .ఆర్.ఎస్.ఎస్ దాని దేశం ఒక్క భావజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెప్తుంది.దాని యొక్క ఆశయాల్లో భారత దేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటే విలువైనవని చెబుతుంది.

పెధ్ధ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లో విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులను దాన్ని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అదుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు, విద్య, మేథస్సు మరియు పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు.ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య, విద్యార్థులకు మరియు కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.

బయటి లింకులు

మూలాలు

  1. Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998
  2. Q & A: Ram Madhav The Hindu - April 14, 2004
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.