రామగుండం
రామగుండం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా,రామగుండం మండలానికి చెందిన గ్రామం.[1]

చరిత్ర

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అనే గ్రామ సమీపంలో త్రేతాయుగములో శ్రీ రామ చంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన గోదావరి నది తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయముగా శివలింగ ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరము, దశరథ మహారాజుని పిండ పరధానముల స్థావరము, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది.
రవాణ మార్గములు

రోడ్డు రవాణ మార్గం
రామగుండం లోని గోదావరిఖనిలో బస్టాండ్ ఉంది. ఇది రాజీవ్ రహదారికి అనుసంధానముగా ఉంది. ఇక్కడి నుండి ప్రతీరోజు హైదరాబాద్ మరియు కరీంనగర్ లకు, అలాగే రాష్ట్రం లోని చాలా ప్రదేశాలకు బస్సులు బయలుదేరుతాయి.ప్రస్తుత తెలంగాణ రాష్ర్ట రాజధాని అయిన హైదరాబాద్ నుండి గోదావరిఖని వరకు 4 వే రోడ్డు నిర్మించటం జరిగింది.
రైలు మార్గం

రామగుండంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది హైదరాబాద్ నుండి మరియు చెన్నై నుండి ఢిల్లీకి వెళ్లే మార్గం. ఇది దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ కిందకి వచ్చును. ఈ స్టేషనులో దాదాపు అన్ని రైళ్లు ఆగును. ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చే రైలుకి రాష్ట్రంలో ఎదురయ్యే ఒక పెద్ద స్టేషను. ఉత్తమ రైల్వే స్టేషన్గా 2 సార్లు అవార్డు అందుకున్నటువంటి స్టేషన్ ఇది.
పాలనా విభాగాలు
ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానం.ఇది పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
ప్రస్తుత రామగుండం నియోజక వర్గం ఎమ్. ఎల్.ఎ. కోరుకంటి చందర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో ఉన్నారు. రామగుండం ఒక నగర పాలక సంస్థ. దీని మేయరు జాలి రాజమణి, ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీకి చెందిన అభ్యర్ధి.
ప్రముఖ సంస్థలు
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
- రామగుండం థర్మల్ పవర్ కార్పోరేషన్ (టి.యస్. జెన్ కో)
- సింగరేణి సంస్థ (బొగ్గు బావులు)
- పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ)
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మూలాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016