రథసప్తమి

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.

రథ సప్తమి
Ratha Saptami
Surya - the Sun god with consorts Saranyu and Chhaya
యితర పేర్లుసూర్య జయంతి, మాఘ సప్తమి
జరుపుకొనేవారుహిందువులు
ప్రారంభంమాఘ శుద్ధ సప్తమి
సంబంధిత పండుగWorship of Sun god Surya
ఆవృత్తిannual

కాల నిర్ణయం

సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

విధి విధానాలు

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

వ్రతకథ

భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.[1]

ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.

మూలాలు

  1. రథ సప్తమి, హిందువుల పండుగలు-పర్వములు, తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004, పేజీలు: 188-192.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.