రంగనాథ రామాయణము

కర్తృత్వం

వర్థమానపురాన్ని ఏలిన గోన బుద్దారెడ్డి తండ్రి కోరిక మేరకు క్రీ.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు.[1] పాల్కుర్కి సోమనాథుడు తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు.[2] ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు[3].

ప్రాచుర్యం

గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్దపుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:

  1. కవిత్రయం వారి ఆంధ్రమహాభారతం
  2. గోన బుద్దారెడ్డి కృతమైన రంగనాథ రామాయణము
  3. పోతన భాగవతం

"రంగనాథ రామాయణం ద్విపద కావ్యాలలొనే నగ్రగణ్యము, తెలుగు సాహిత్యమందలి యుత్తమోత్తమ కావ్యములలో నొకటి" అని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ప్రశంసించారు. 17-18 శతాబ్దాలలొ జానపదుల, బుర్రకథలలో ఈ కావ్యాన్ని ఉపయోగించారు. రంగనాథ రామాయణం కృతులు మనదేశంలోనే కాకుండా ఫ్రాన్సు, ఇంగ్లాండు లాంటి దేశాలలో కూడా లభ్యమైనాయి. దూరదర్శన్‌లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్" రూపకల్పనలో దర్శక నిర్మాత రామానంద్ సాగర్ రంగనాథ రామాయణాన్ని కూడా ఆధారంగా స్వీకరించారు.

మూలాలు

  1. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు
  2. కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168
  3. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.