యు.ఆర్.అనంతమూర్తి

కన్నడ సాహిత్యరంగంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన ఎనిమిది మంది కన్నడ సాహితి వేత్తలలో ఉడిపి రాజగోపాలచార్య అనంతమూర్తి (డిసెంబరు 21, 1932 - ఆగష్టు 22, 2014) ఆరవవాడు. రచయిత మరియు సాహిత్య విమర్శకుడు. ముక్కుసూటిగా తన మనస్సులోని భావాన్ని వ్యక్తపరచే వ్యక్తిత్వమున్నవాడు. మోడీ ప్రధాన మంత్రి అయితే తను భారతదేశంలో వుండనని ఖరాఖండిగా చెప్పినట్టివాడు[1]

యు.ఆర్.అనంతమూర్తి
పుట్టిన తేదీ, స్థలం డిసెంబరు 21, 1932
మెలిగె, తిర్థహళ్లి తాలూక, షిమోగా జిల్లా, కర్నాటక
మరణం ఆగష్టు 22, 2014
వృత్తి అధ్యాపకుడు, రచయిత, కర్నాటక కేంద్ర విశ్వవిద్యాలయం యొక్క కులపతి
జాతీయత భారతదేశం
రచనా రంగం కాల్పనిక సాహిత్యం, సాహిత్య విమర్శ
సాహిత్య ఉద్యమం నవ్య కన్నడ సాహిత్యం
ప్రభావం రాం మనోహర్ లోహియా, గోపాలకృష్ణ అలిగ, శాంతవేరి గోపాలగౌడ, మహాత్మా గాంధీ

జననం-విద్యాభ్యాసం

జ్ఞానపీఠ ఆవార్డును పొందిన మరో కన్నడ సాహితివేత్త కువెంపు పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ). జన్మించిన తేది 1932 సంవత్సరం డిసెంబరు 21[2]. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్రాథమిక విద్య అనంతరం, తిర్థహళ్ళి, మరియు మైసూరులో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై ఇంగ్లాండుకు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, 1966లో ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో పీ.హెచ్.డి. పొందారు[3]

వృత్తి జీవనం

1970లో మైసూరు విశ్వవిద్యాలయంలో మొదట ఇంగ్లీషు విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం 1982లో కేరళ రాష్ట్రంలోని కొట్టాయం లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు. 1992-93 సంవత్సరంలో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియాకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే 1993లో కేంద్ర సాహిత్య అకాడమీకి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. కేంద్ర సాహిత్య అకాడమీకి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.

అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, అమెరికా లోని ఐయోవా మరియు టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు కొల్హాపూర్ లోని శివాజీ విశ్వవిద్యాలయంలలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు. మంచి రచయిత, వక్త అయిన అనంతమూర్తి, ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపించాడు. 1980 లో భారతీయ రచయితల సంఘ సభ్యుడిగా సోవియట్ రష్యా, పశ్చిమ జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలను సందర్శించాడు. మార్క్స్‌వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్ఫూర్తినిచ్చి, సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడిగా 1989లో మరలా రష్యాను పర్యటించాడు. 1992లో చైనాను కూడా సందర్శించాడు.

సాహిత్య సేవ

అనంత మూర్తి 1955 లో విడుదలచేసిన ఎందెందు ముగియద కతె కథా సంకలనం ద్వారా ఆయన సాహిత్యకృషి మొదలైనది. మౌని, ప్రశ్నె, ఆకాశ మత్తు బెక్కు-అనంతమూర్తి యొక్క ఇతర కథసంకలనాలు. ఈ మూడు కథలను కలిగిన మూరు దశకద కథెగళు అనే సంక్షిప్త కథా సంపుటం 1989 లో ప్రకటితమైనది. ఇతడు 2002లో తుమకూరులో జరిగిన 69వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.

రచనలు

  • సంస్కార
  • భారతీపుర
  • అవస్థె (1978)
  • భవ (1994)

సినిమా రంగం

ప్రశస్తి

సంస్కార, ఘటశ్రాద్ధ మరియు బర చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా ప్రశంసలు అందుకున్నాడు. 1983లో కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం, 1992 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1994 లో మాస్తి పురస్కారంతో అనంతమూర్తిని గౌరవించడమైనది. 1994లో ఆయన్ను భారతదేశంలో అత్యుత్తమ సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ అవార్డుతో సత్కరించారు.

మరణం

2014, ఆగష్టు 22 న అనారోగ్యంతో కన్నుమూశారు.

బయటి లింకులు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.