మొల్ల రామాయణము

మొల్ల రామాయణము, సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు.

మొల్ల రామాయణము తాటాకు ప్రతి

దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.

మొల్ల ఏ విధమయిన సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్పుకొనినది. తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేయుచున్న విధముగా ధనము మరియు కీర్తిని ఆశించక ఏ రాజులకునూ అంకితము నివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనము. మొల్ల రామాయణము ఆరు కాండములలో సుమారు 870 (పీఠికతో కలిపి) పద్యములతో కూడుకున్నది. అంతకు మునుపే పలువురు రామాయణమును గ్రంథస్థం చేసిన విషయమును ప్రస్తావించుచూ తన పద్యకావ్యములోని మొదటి పద్యములలో ఇట్లనినది.

రాజిత కీర్తియైన రఘురాము చరిత్రము మున్ గవీశ్వరుల్
తేజ మెలర్ప చెప్పి రని తెల్సియు గ్రమ్మర జెప్పనే లనన్
భూజన కల్పకం బనుచు, భుక్తికి ముక్తికి మూలమంచు, నా
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే?

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.