ముత్తుస్వామి దీక్షితులు

ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు . వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. ఇతడు ముద్దు కుమారస్వామి దయవలన జన్మించిన ఇతనికి ముద్దుస్వామి దీక్షితర్ అని ఇతని తల్లిదండ్రులు పేరు పెట్టారు. ముద్దుస్వామి దీక్షితర్‌ కాలక్రమేణా ముత్తుస్వామి దీక్షితర్‌గా పిలువబడ్డాడు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంథం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంథాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.[1]

ముత్తుస్వామి దీక్షితులు
మూలం తిరువారూర్, తంజావూరు, భారతదేశం
రంగంకర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక సంగీతం, వాగ్గేయకారుడు

చిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితర్‌ను కాశీకి తీసుకెళ్ళాడు. అక్కడ ఇతడిని ఉపాసనా మార్గంలో అతడు ప్రవేశపెట్టాడు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. "శ్రీనాధాధి గరు గుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు ప్రథమావిభక్త్యంతంగా సంస్కృతంలో రచించి రాగం కూర్చాడు. తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను అతడు రచించాడు. తరువాత ప్రథమావిభక్తి మొదలుకొని సంబోధనావిభక్తి వరకు కల ఏడు విభక్తులతో ఏడు కీర్తనలు రచించాడు. ఆధ్యాత్మిక వెలుగులో ఇతడి సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకున్న వారికి తన కృతులను ఆలాపించడం బోధించాడు.

తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఖంలో ఉన్నప్పుడు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించాడు. అక్కడే అతడు "మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి" అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించాడు. ధ్యాన యోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితర్ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు, నవ గ్రహాలపైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఇతడు ఎన్నో కీర్తనలను రచించాడు. "శివ పాహి ఓం శివే" అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించాడు.

అటువంటి అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. హిందూస్థానీ సంగీతం నుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలో కమలాంబా నవవర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి. ఇతని కృతులు సుమారు 300 వరకు ఉన్నాయని సంగీతజ్ఞులు అంచనా వేశారు. ఇతని రచనలన్నీ నారికేళపాకంలో ఉండి విద్వత్తును కలిగి ఉన్నాయి. ఇతని రచనలలో శాల్కట్టు స్వరము, మణిప్రవాళ సాహిత్యము, స్వరాక్షరములు మొదలైనవి కనిపిస్తాయి. ఇతడు గోపుచ్ఛయతి, శ్రోతవహ యతులతో రచనలు చేయడానికి దారి చూపాడు. రాగముద్ర, రాజముద్ర, వాగ్గేయకార ముద్ర మొదలైన అష్టాదశ ముద్రలు ఇతని కృతులలో కనిపిస్తాయి. ఇతడు సంగీతంలో ఎన్నో అద్భుతాలను సాధించాడని అంటారు. ఇతడు తీర్థయాత్రలు చేసే సమయంలో ఒకచోట అక్కడి కరువు కాటకాలను చూసి మనసు ద్రవించి అమృతవర్షిణి రాగంలో ఇతడు ఆనందామృత వర్షిణి అనే కీర్తనను ఆశువుగా పాడిన వెంటనే అక్కడ వర్షం కురిసింది.

ఇంకా చూడండి

మూలాలు

  1. టి. ఎల్.వెంకటస్వామి అయ్యర్(మూలం), టి సత్యనారాయణమూర్తి(అను ) (1996). ముత్తుస్వామి దీక్షితార్. Retrieved 2018-05-03.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.