ముట్నూరి కృష్ణారావు

ముట్నూరి కృష్ణారావు (1879 - 1945) ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.

ముట్నూరి కృష్ణారావు
ముట్నూరి కృష్ణారావు

జీవిత విశేషాలు

మట్నూరి కృష్ణారావు చిత్రపటం

"కృష్ణా పత్రిక" సంపాదకులుగా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరుగ్రామంలో జన్మించారు. ఈయన పుట్టగానే తల్లి గతించింది. బాల్యంలోనే తండ్రి పరిమపదించడం వల్ల పినతండ్రి ప్రాపకములో పెరిగాడు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం బందరులోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ కోర్సులో చేరాడు. ఇక్కడే ఈయనకు రఘుపతి వెంకటరత్నంనాయుడు యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజములో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రికనుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించాడు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశాడు.

బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరాడు. ఇక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవాడు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. కృష్ణారావుగారు మద్రాసులో ఎఫ్.ఎ చదువుతున్నరోజులలో వంగనాయకుడు బిపిన్ చంద్రపాల్ గారు బ్రహ్మ సమాజం ఉపన్యాసములు ఇవ్వ్వటానికి మద్రాసు విచ్చేసినప్పుడు కృష్ణారావు గారికి ఆయన మీద గురి కుదిరి, ఆయనకి శిష్యులు అయినారు. అటుపై వంగవీరునితో బెంగాలు వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి కలకత్తాలో బిపిన్ పాలు, అరవింద ఘోష్, ఠాగూర్ వార్ల పరిచయము వలన వచ్చిన అనుభవముతో 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనాడు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం ఆంధ్ర భారతి అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించాడు.

తరువాతి కాలంలో బందరు (మచిలీ పట్నం) లో స్థిరపడి ఆంగ్ల భాషలో గొప్ప వక్తగా పేరొందారు. కృష్ణా పత్రిక కార్యాలయంలో వీరి గోష్ఠిని సాహితీ వేత్తలు " దర్బారు"గా వ్యవహరించేవారట. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలంలో చురుకుగా వ్యవగహరించేది. ఆ రోజుల్లో పత్రిక కార్యాలయలంలో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘీక విషయాలపై పలు చర్చలు జరిగేవట. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీ ముట్నూరి ఒక కళగా, తపస్సుగా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణా పత్రికలో వచ్చే వార్తల పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట.

మూలాలు

  • ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు - ఎం.దత్తాత్రేయశ్రర్మ, శ్రీరామ సిద్ధాంతి ప్రచురణలు, (1992) పేజీ.5-6
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.