ముకురాల రామారెడ్డి

ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.

జీవిత విశేషాలు

ఇతడు పాలమూరు జిల్లా, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1929 జనవరి 1వ తేదీన జన్మించాడు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. తెలుగు అకాడెమీ ఉపసంచాలకులుగా పనిచేశాడు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణా రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థలలో చురుకుగా పాల్గొన్నాడు.ఇతడు 2003, ఫిబ్రవరి 24న మరణించాడు.

రచనలు

  1. తెలుగు ఉన్నత వాచకం (సంపాదకత్వం)
  2. దేవరకొండ దుర్గము
  3. నవ్వేకత్తులు (దీర్ఘ కవిత) [1]
  4. హృదయశైలి (గేయ సంపుటి)
  5. మేఘదూత (అనువాద కవిత్వం)
  6. రాక్షస జాతర (దీర్ఘ కవిత)
  7. ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం)
  8. తెలుగు సాహిత్య నిఘంటువు
  9. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం ( సిద్ధాంత గ్రంథం)

కథారచయితగా

ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. భూమిశిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు[2]. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది[3]. 'విడిజోడు ' కథకు కృష్ణాపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.[4]

మూలాలు

  1. ముకురాల, రామారెడ్డి (1971). నవ్వేకత్తులు (1 ed.). హైదరాబాదు: తిరుమల శ్రీనివాస పబ్లికేషన్స్. Retrieved 18 December 2014.
  2. ఐతా, చంద్రయ్య (April 1, 2012). "దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 18 December 2014.
  3. ముకురాల, రామారెడ్డి. "క్షణకోపం క్షణకోపం". కథానిలయం. కథానిలయం. Retrieved 18 December 2014.
  4. సింగిడి-1,తెలుగువాచకం,9 వ తరగతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015,పుట-26
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.