మహాదేవి వర్మ
మహాదేవి వర్మ ( జ: ఏప్రిల్ 27, 1907 - మ: సెప్టెంబర్ 11, 1987 ) ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. ప్రముఖ కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను విశాల హిందీ మందిరపు సరస్వతిగా అభివర్ణించాడు.[1]
| మహాదేవి వర్మ | |
|---|---|
![]() | |
| రచయిత మాతృభాషలో అతని పేరు | महादेवी वर्मा |
| పుట్టిన తేదీ, స్థలం | 1907 మార్చి 26 ఫారుఖ్రాబాద్ , బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1987 సెప్టెంబరు 11 (వయసు 80) అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం |
| వృత్తి | నవల రచయిత మరియు కవయిత్రి |
| భాష | Hindi |
| జాతీయత | భారతీయురాలు |
| విద్య | ఎం ఏ సంస్కృతం , అలాహాబాద్ యూనివర్సిటీ |
| సాహిత్య ఉద్యమం | చయవాడ్ |
| గుర్తింపునిచ్చిన రచనలు | యమ మేరా పరివార్ పాత్ కె సాథీ |
| పురస్కారాలు |
|
| జీవిత భాగస్వామి | డా. స్వరూప్ నారాయణ్ వర్మ |
స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ నివసించిన ఈమె బహుళ సమాజంలో పనిచేస్తూనే భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి, పరిశీలించి, అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించిన కవుల్లో ఒకర్తె. ఈమె కవితలే కాకుండా ఈమె చేపట్టిన సమాజోద్ధరణా పనులు, మహిళాచైతన్యం కోసం చేసిన కృషి ఈ దృష్టితోనే ప్రభావితమైనవి. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే దీపశిఖలో అది ప్రతి మనిషి యొక్క వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులనే కాకుండా సమీక్షకులను కూడా లోతుగా ప్రభావితం చేసింది.
ఈమె ఖరీబోలీ హిందీ మాండలికంలో వ్రాసిన కవితల్లో అప్పటివరకు కేవలం భృజ్ భాషలోనే సంభవమని అనుకొన్నంత మృదువైన శబ్దాలను పలికించింది. దీని కోసం ఆమె తన సమయంలో వాడకంలో ఉన్న సంస్కృత మరియు బెంగాళీ భాషలలోని మృదువైన పదాలను ఎన్నుకొని వాటికి హిందీ తొడుగులు తొడిగింది. సంగీతంతో పరిచయముండటం వల్ల ఈమె పాటల నాథ సౌందర్యం, లయబద్దమైన వ్యంజనాల శైలి అనితరసాధ్యమైనది. అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది. ప్రతిభావంతమైన కవయిత్రి మరియు గద్య రచయితైన మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతో పాటు చక్కటి చిత్రకారిణి మరియు సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు హిందీ సాహిత్యంలోని అన్ని పతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకొన్న గౌరవము దక్కింది. భారత సాహిత్యాకాశంలో మహాదేవివర్మ ధ్రువతారగా వెలుగుతున్నది. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా మహాదేవివర్మ వెలుగొందింది. 2007లో ఈమె జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడినవి.
