మధ్వాచార్యుడు

మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు.

మధ్వాచార్యులు

పుట్టుక / బాల్యము

మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.

బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.

ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.

దక్షిణభారత యాత్ర

యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.

రచనలు

తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి

  1. గీతాభాష్యం
  2. గీతాతాత్పర్యం
  3. బ్రహ్మసూత్రభాష్యం
  4. అణువ్యాఖ్యానం
  5. న్యాయవివరణం
  6. అణుభాష్యం
  7. దేశోపనిషద్భాష్యం
  8. మహాభారతతాత్పర్యనిర్ణయం
  9. యమకభారతం
  10. దశప్రకరణం
  11. తంత్రసారం
  12. ద్వాదశస్తోత్రం
  13. కృష్ణార్ణవామృతం
  14. సదాచారస్మృతి
  15. జయంతినిర్ణయం
  16. ప్రణవకల్పం
  17. న్యాసపద్ధతి
  18. తిథినిర్ణయం
  19. కందుకస్తుతి

ద్వైత వాదం

జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:

  1. సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
  2. సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
  3. సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
  4. సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.

ద్వైతమత ప్రభావం

మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు.దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.

నిర్యాణం

మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.