మంజీరా నది

మంజీరా (మరాఠీ: मांजरा; కన్నడ: ಮಂಜೀರ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు[1]

మంజీరా నది
River
దేశం భారతదేశం
రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
Mouth గోదావరి
 - location కందకుర్తి, తెలంగాణ, భారతదేశం
పొడవు 724 km (450 mi)
పరివాహక ప్రాంతం 30,844 km2 (11,909 sq mi)
పటం యొక్క పైభాగంలో మంజీరా నది పరీవాహక ప్రాంతం

మంజీరా నది సాధారణంగా తూర్పు, ఆగ్నేయంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్ మరియు తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. 102 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 823 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ఘర్నీ, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలయి, లెండీ మరియు మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు. పరీవాహక ప్రాంతంలో సాలీనా 635 మి.మీ.ల వర్షపాతం కురుస్తుంది.[2] పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 15,667 చ.కి.మీ.లు కర్ణాటకలో 4,406 చ.కి.మీ.లు మరియు తెలంగాణలో 10,772 చ.కి.మీ.లు విస్తరించి ఉంది.[1]

ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామము వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామము వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా ఉంది.

నదిపై ప్రాజెక్టులు

మంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని ఘన్‌పూర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట ద్వారా నీటిని మళ్ళించి మెదక్ జిల్లాలోని ఐదు వేల ఎకరాలకు నీరు అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ (మహబూబ్ నహర్)ను కూడా నిర్మించారు. 1904లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు మరింతగా సద్వినియోగ పరచుకొనేందుకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ఎడమ కాలువ (ఫతే నహర్)ను నిర్మించాడు. ఘన్‌పూర్ ఆనకట్ట యొక్క ప్రస్తుత ఆయకట్టు 30 వేల ఎకరాలు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.