బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు

శ్రీ స్వారాజ్యాశ్రమ వ్యవస్థాపకులు, సాక్షాత్ శివస్వరూపులు, ప్రస్థానత్రయ భష్యకారులై జగద్గురువులుగా కీర్తినొందిన బ్రహ్మీభూత, బ్రహ్మలీన, బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు ఆంధ్రదేశం నలుచెరుగులా శ్రీ స్వారాజ్య ఆశ్రమాలెన్నింటినో స్థాపించారు. వైఎస్ఆర్ జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణంలో 1943లో శ్రీ స్వారాజ్య ఆశ్రమమును స్థాపించిరి. నాటి నుండి నేటి వరకు ఈ ఆశ్రమము ఎంతో అభివృద్థిని సాధించి ఎందరో జిజ్ఞాసువులకు ముముక్షత్వము ప్రసాదించింది.

జీవిత సంగ్రహ విశేషములు:

రాయలసీమ, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం నివాసులగు పద్మశాలి, పొడరాళ్ళ రామక్క తిరువెంగలప్పగారి ద్వితీయ పుత్రుడై 1900 సంవత్సరమున జన్మించిరి. సంస్కార జీవులు గనుక తన 8వ ఏటనే తన పెదతండ్రి పుత్రుడైన, పొడరాళ్ళ రామస్వామి గారి ద్వారా పురాణశ్రవణమును గావించిరి. పురాణకథమున, వేదాంతాంశముల, పౌరాణికుడు, విడుచుచుండుట గమనించి, వాటిని నేర్వవలెనని తలంపు గలిగియుండెను. బాల్యముననే ప్రాథమికవిద్యా పట్టభద్రులై అనంతపురం తాలూకా, సిద్ధారాంపురం మజరా, కొత్తపల్లి గ్రామములో విద్యాబోధక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారత, భాగవత, రామాయణములకు అర్థముల చెప్పుచూ శ్రోతలను ఆనందింపజేసెడివారు. తాడిపత్రి తాలూకా పూతిరెడ్డిపల్లి వాస్తవ్యులైన వెంకటయ్యగరిచే, గురుబోధను శ్రవణముచేసి గురూప దేశమును బోంది శ్రీమతి గంగిరెడ్డి పాపమ్మగారి ఇంట వేదాంత గ్రంథముల వినిపించెడివారు. ఉపాధ్యాయ వృత్తిలోనుండియే గురువుల సేవించుచు బ్రహ్మవిద్యను సంపాదించుచుండెడివారు. శాస్త్రసంబంధ బ్రహ్మవిద్యను రూఢిగ సంపాదించితినని భావించి యుండిరి. బళ్ళారి జిల్లా రాయదుర్గం తాలూకా గొల్లపల్లి గ్రామంలో జరిగిన శివరాత్రి సభలో బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల బోధామృతమును గ్రోలి శాస్త్రములకును, నరహరి బోధనకు గల తారతమ్యమును గుర్తించి, నరహరి గురురహస్యార్థముల బ్రహ్మవిద్య రహస్యముల వారి కృపచే పూర్ణముగా గ్రహించిరి, గాని మనస్సు నిలువని కొరత మాత్రము మిగిలియుండెను. ఆ కొరత దైవసన్నిభుడైననొక మహాత్మునిచే తీర్చుకొని ఇద్దరినేకము జేసికొని నరహరి స్వారాజ్య జగద్గురువుల గురుభక్తుడై విలసిల్లెను

శ్రీ నరహరి సద్గురు ముఖమున సంస్కృత, వేద, వేదాంత, వ్యాకరణ, భాష్య, శాస్త్రముల కూలంకషముగా నభ్యసించిరి. శాస్త్ర పరిచయము, శాస్త్రమంత్ర రహస్యార్ధములు, మనస్సు నిలిచెడి గురుకీలుచే అనుభవజ్ఞానమును పరిపూర్ణముగ పొంది తృప్తినొందిరి. ఉపనిషత్, భగవద్గీత, బ్రహ్మ సూత్రములగు ప్రస్థానత్రయములకు ఇంతవరకు వ్రాసిన భాష్య టీకా తాత్పర్యములు, బాహ్యముగానే నడచినవనియు రహస్యార్థములవైపు త్రిప్పలేదనియు నొక అభిప్రాయము వారి హృదయములో ఉద్భవించినది


తాడిపత్రి శ్రీ మూలా లక్ష్మీనారాయణస్వామి గారి ధన సహాయమున భగవద్గీతను రహస్యార్థములవైపు, టీకా తాతర్య విశేషార్థములతో, శృతి, యుక్తి, అనుభవ పూర్వకముగా రచియించి, శ్రీ స్వారాజ్య భగవద్గీతా యనుపేర 23-11-1939 వ సంవత్సరమున ముద్రంచి వెల్లడి చేసిరి. ఈశ, కేన ముండక, మాండుక్యతైత్తిరీ యోపనిషత్తులకు అంతరార్థమును వ్రాసి అచ్చొత్తించి ఉపనిషన్నిక్షిప్త రత్నముల ముముక్షులోకమునకు నందచేసిరి, కడప జిల్లా జమ్మలమడుగు వాస్తవ్యులైన శ్రీ చౌడం తిరువేంగలప్ప గారి ద్రవ్య సహాయమున తైత్తిరియోపనిషత్తు లోని అమృతము పంచబడింది. అనంతపురం శ్రీ గొంది పెద్దకొండప్ప గారి ద్రవ్య సహాయమున బ్రహ్మసూత్రముల రహస్యార్థముల అమృతము లోకమునకు అందింపబడెను. ప్రొద్దుటూరు నివాసియు శ్రీవారి శిష్యులునగు బ్రహ్మశ్రీ మార్తల వీరారెడ్డి గారి సంభాషణ రూపమున గీతానవనీతమును వ్రాసి జిజ్ఞాసువులకు జ్ఞానరత్న వర్షముగా కురిసిన మేఘముగా శ్రీవారు ప్రపంచ విఖ్యాతి గాంచిరి. ప్రపంచమున గల సర్వమానవుల దేహోపాధియందు దేవుడు ఆత్మరూపమున నున్నాడనియు, అందరియందు వేదములే అంగములుగా గల సూక్ష్మశరీరమున్నదనియు, అందరిలో హంసయనెడు శ్వాస ఆడుచున్నదనియు, ఈశ్వర సంతానమైన సమస్త మానవులు బ్రహ్మవిద్యను, బ్రాహ్మణిష్ఠను అనుష్ఠించి దుఃఖనివృత్తి, పరమానందప్రాప్తి, రూప, మోక్షంబగు స్వారాజ్యసింహాసనాసీనులై పరమశాంతిని బొంది, తరించుటకు సహజ వారసత్వము గలవారై యున్నారనియు, జాతి, కులమతములు, మానవకల్పితములని భావించి "సర్వేజనా స్సుఖినో భవంతు" అన్న ఆర్యోక్తిని ననుసరించి 1921 సంవత్సరమున మహోన్నతమైన శ్రీ స్వారాజ్యపీఠ వ్యవస్థాపకులై దేశము నాలుగు చెఱుగల స్వారాజ్య సంఘములు నెలకొల్పి విరివిగా ప్రచారము గావించిరి.


శ్రీవారు రచించి వెలువరించిన గ్రంథములు స్వారాజ్య భగవద్గీతా, స్వారాజ్యము, దేవుడు, ముక్తి, గాయత్రి మంత్రరహస్యము, ఉత్తరగీతా, జీవమణి, పరమేశ్వర పంచముఖములు. సోపానాలు, పురుషసూక్తము, నారాయణ శతకము, ముక్తి సూక్తములు, వేద రహస్యములు, జ్ఞానసముద్రము అనుభవామృతార్ణవము, గీతా మహాత్మ్యము, గీతా మథనము, దేవభషార్కము, గీతానవనీతము మొదలగు అనేక గ్రంథముల రచించి లోకమున వ్యాపింపచేసిరి. 42వ సంవత్సరంలో ప్రొద్దుటూరు నందును శిష్యులచే స్వారాజ్యాశ్రమమును, ఆ తరువాత అనిమెల యందు కైవల్యాశ్రమము పేర, అనంతపురమునందును, ఇంకను అనేకచోట్ల ఆశ్రమములను నిర్మించి 10 లక్షలకు పైగా శిష్యకోటికి జ్ఞానదానము చేసి, కొందరిని గురువులుగా తయారుచేసిరి


చాలాకాలము క్రిందటనే తాడిపత్రి పినాకినీనదీ తీరములో స్వారాజ్యాశ్రమమును నిర్మించి 1945, 46, 47 సం ల వరకు మూడు సంవత్సరముల పాటు మౌనవ్రతము ఆచరించిరి.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణములో 1948 లో హిందూమత ప్రచారక శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులకును, శ్రీవారికిని 2 మాసములు జరిగిన సంవాదమునందు 29-12-1948 తేదిన శ్రీ పండితులవారిచే బ్రహ్మజ్ఞానమును ప్రతివ్యక్తి సంపాదించికొనవచ్చుననియు, బ్రహ్మజ్ఞానముగల ప్రతివ్యక్తియు బ్రాహ్మణుడే అనియు ఒప్పించిరి.


1962వ సంవత్సరములో కాకినాడ పట్టణములో సుమారు ఆరు మాసములుగా జరిగిన వేదపరిషత్ మహాసభయందు ఉద్దంఢ పండితుల వేదాంత ప్రశ్నలకు సమాధానము చెప్పి గాయత్రీ మహామంత్ర రహస్యార్థమును శ్రుతి, యుక్తి, అనుభవపూర్వకముగా నిరూపించి నవరత్న ఖచిత సువర్ణ కిరీటమును, భుజకీర్తులను, మకరకుండలములను, హస్తకంకణ ఓంకార పతక అంగుళ్యాభరణములచే సత్కరింపబడిరి.


కడప పట్టణములో స్వారాజ్య సంఘమును బ్రహ్మ స్పర్శవేది సంఘముగా రిజిష్టరు చేయించి 1968లో "సత్యాన్వేషిణి" అను మాస పత్రికను వారు స్వరూప సిద్ధి నొందువరుకు నడిపిరి.
1972వ సంవత్సరము నుండి జగద్గురు పాఠశాలను నడుపుచు, రాక్షస నామ సంవత్సరము ఆషాఢ శుద్ధ ద్వాదశీ 20-7-1975 తేది ఆదివారము రాత్రి 11 గంటలకు ప్రొద్దటూరులో స్వారాజ్యశ్రమమున తనువు చాలించి విదేహముక్తులై వెలసిరి. శ్రీవారి భౌతిక దేహము ప్రొద్దటూరు శ్రీ స్వారాజ్యశ్రమము నందే నిక్షిప్తము గావింపబడియున్నది.

బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల సద్గురు పరంపర

1. శ్రీ మన్నారాయణ యతీశ్వరులు (1800 - 1870) :

దివ్యమైన హిమాలయ పర్వతము పవిత్రభారతావనికి పెట్టనికోట. ఎందరో యతీశ్వరులకు, ఋషి పుంగవులకు, మహాత్ములకు నిలయము. అటువంటి హిమాలయముల నుండి వచ్చినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైన నారాయణ యతీశ్వరులు సుమారు 1830 ప్రాంతములో దక్షిణ భారతదేశంలో సంచరించుచు గాద్వాల్ నగరము లోని ఆధ్యాత్మిక శాస్త్రకోవిధులు సదసద్వివేచాపరులు సదాచార నిష్ఠులు అయిన శ్రీ శ్రీనివాసాఖ్యుల వారికి మంత్రోపదేశమొనరించిరి


2.శ్రీ శ్రీనివాసాఖ్య సద్గురువులు (1810 - 1890) :

గద్వాల్ ఆస్థానపండితులైన శ్రీ శ్రీనివాసాఖ్య సద్గురువులు ఎంతోమంది జిజ్ఞాసువులకు జ్ఞానబోధ చేస్తూ ఒక పండిత సభలో కలిసిన లక్ష్మణయోగి అను విప్రోత్తముని గాంచి కడు సంతసించి వారికి గురుదీక్షనొసంగిరి

3. శ్రీ లక్ష్మణ యోగీశ్వరులు (1830 - 1910) :

కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా చెళ్ళెకెరె తాలూకా, శిరివాళం గ్రామస్తులైన శ్రీ లక్ష్మణయోగి ఆజన్మ బ్రహ్మచారులు. దివ్యమైన తేజస్సుతో, బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశించే వేదవేదాంగ పారంగతులు. తెలుగు, కన్నడ, సంస్కృత భషలలో పండితులు. వీరు గద్వాల్ సంస్థానంలో పండిత సన్మానం అని తెలిసి, వెళ్ళి శ్రీనివాసాఖ్య సద్గురువుల దర్శన భగ్యంచే తరించి వారి ఆదేశానుసారం బళ్ళారి, రాయదుర్గం ప్రాంతములలో సంచరిస్తూ భక్తులకు బ్రహ్మానందానుభూతిని కలిగించిరి. శ్రీవారు పల్గుణ శుద్ధ దశమినాడు శిరివాళం గ్రామంలో జీవ సమాధిని పొందినారు. వారి యొక్క దివ్యసమాధి శిరివాళం గ్రామంలోనున్న పొలంలో దిగుడుబావి ప్రక్కన బిల్వవృక్షం నీడలో వున్నది

4. శ్రీయాదాటి నరహరి సద్గురు స్వాములు (1859 - 1929) :

రాయదుర్గం నివాసి అయిన తేజోమూర్తులు బ్రహ్మవిద్యా పారంగతులు అయిన శ్రీ యాదాటి నరహరి శాస్త్రిగారు సంస్కృత అంధ్రభాషలలో చక్కగా అభ్యసించి, వేదాధ్యయనము గావించిరి. వారి యొక్క వాక్పటిమ మరియు సంగీత సాహిత్య ప్రావీణ్యత అధ్భుతంగా అందరిని ఆకర్షించి ఆకట్టుకునేవి. ఆధ్యాత్మిక విద్యావేత్తలు అంతరార్థ ప్రబోధకులు అయిన శ్రీవారు ఒకసారి శివరాత్రి సందర్భంగ వేదాంతం లక్షణార్యులను చూసి వారిలో వున్న జిజ్ఞాసను గుర్తించి వరిని తన శిష్యులుగా చేసుకొని వేదాంత శాస్త్ర రహస్వార్ధములను ధరపోసిరి


హిమాలయ గిరీంద్రస్థో, సమాశ్రిత గుణాశ్రయః
నిర్గుణో నిర్వికల్పశ్చ, నారాయణ యతీశ్వరః
తస్య హస్తాబ్జ సంజాతో శ్రీనివాఖ్యదేశికః
తస్యాంతే వాసి సర్వజ్ఞో లక్ష్మాణాఖ్య గురాత్తమః

శ్రీమల్లక్ష్మణయోగిపుంగవ కరాబ్జాతోద్భవం సద్విజం
సత్యాసత్య విచారణైక నిపుణం సచ్చ్చిత్సుఖోద్భోధకం
హృత్పద్మేలసితం వరాభయకం ఓంకార పీఠస్థితం
శ్రీ రాయాద్రి నివాసినం నరహరిం శ్రీయద్గురుం సంశ్రయేత్

కైవల్యామృతపాన శిష్యవిభవం స్వారాజ్యపీఠస్థితం
శ్రీయాదాటినరహరి శిష్యతిలకం వేదాంత విజ్ఞానదం
ఆత్మానాత్మ వివేకదత్త సువచం శ్రీ లక్ష్మణార్యోత్తమం
పృథ్వీ స్థానతురీయ మార్గగమనం చైతన్యమూర్తింభజే

మనచేత ఏమియు గానేరదు (చైతన్య శక్తి లేనిది ఏమియు జరగదు)
మనము లేనిది ఏదియుగా నేరదు (చైతన్య శక్తికి కర్తృత్వ కరణములుంటేనే జరుగును.)

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.