బంగినపల్లి మామిడి
బంగినపల్లి మామిడిని బేనీషాన్ మామిడి అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో ఇది ఒకటి. తెలుగింట పుట్టి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల నోరూరించే ఈ రకం మామిడి ‘ఆంధ్రప్రదేశ్ సొంతం’ అని నిర్ధారిస్తూ భౌగోళిక విశిష్ఠ గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటికేషన్ - జీఐ) లభించింది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ ఓపీ గుప్తా బుధవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక మహిళ, పురుషుడు (రైతులు), పసుపు పచ్చ వర్ణంలో మామిడిపండ్లతో బనగానపల్లె నవాబు యుద్ధ నిధుల మొహరీ రూపొందించారు. దానిపై... ‘బనగానపల్లె మామిడిపండ్లు - ఆంధ్రప్రదేశ్’ అని లిఖించారు. ఇదే ప్రధాన ఆధారంగా బంగినపల్లి మామిడిపండ్లకు జీ.ఐ. గుర్తింపు దఖలు పడింది.[1][2]
| బనగానపల్లె మామిడి | |
|---|---|
![]() బనగానపల్లె మామిడి గుంటూరులొ సైకిల్ పై అమ్మబడుతున్నది | |
| వివరణ | కర్నూలు జిల్లాలొ పండే మామిడి రకం |
| రకం | వ్యవసాయం ఆధారిత |
| ప్రాంతం | కర్నూలు జిల్లా, ఆంద్రప్రదేశ్ |
| దేశం | భారత దేశము |
| నమోదైనది | 3 May 2017 |
| పదార్థం | |
చరిత్ర
కర్నూలు జిల్లా లోని బనగానపల్లె సంస్థానం అప్పట్లో నవాబుల ఏలుబడిలో ఉండేది. నవాబు మీర్ గులాం అలీఖాన్ (1905-1922)కు మామిడిపండ్లపై మక్కువ ఎక్కువ. మామిడి పండులో మేలు జాతిగా పిలిచే బేనిషాన్ రకాన్ని ఎంపిక చేసుకొని బనగానపల్లె సంస్థానంలో విరివిగా నాటించారు. దీనికే ‘బనగానపల్లె మామిడి’గా పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది ‘బంగినపల్లి’గా మారింది. ఇక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ఈ రకం సాగు విస్తరించింది. ప్రతి ఏటా 5500 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. ఒక్కో పండు రెండు కిలోల వరకు తూగుతుంది. ఏమాత్రం పీచు లేకుండా పూర్తిగా గుజ్జు మాత్రమే ఉండడం దీని ప్రత్యేకత.
దాదాపు 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నివాసులైన నవాబులు విదేశాల నుంచి తీసుకొచ్చి నాటిన మామిడి రకాలలో ఒక మామిడి రకం రుచిలోను, రంగులోను, పరిమాణంలోను విశేషమైన ఖ్యాతిని సంపాదించడంతో ఈ చెట్టుకు కాసిన మామిడి పండ్లను అనేక ప్రాంతాల వారు తీసుకుని వెళ్లి నాటారు. ఈ చెట్టు ఎక్కడ నుంచి తెచ్చి నాటారు అని అడిగినప్పుడు ఇది బనగానపల్లి మామిడి చెట్టు అని చెబుతుండేవారు. ఈ విధంగా బనగానపల్లి మామిడిగా వాసి కెక్కిన ఈ చెట్టు కాలగమనంలో బంగినపల్లి మామిడిగా పేరు గాంచింది.
బేనీషాన్
మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఈ మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది.
పాటలు
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది - చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది (కొండవీటి సింహం - సినిమాలో). ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు పి.సుశీల గానం చేశారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- బంగినపల్లికి భలే గుర్తింపు!
- "Banganapalle mango gets GI tag". The Hindu (in ఆంగ్లం). Retrieved 5 May 2017.
