పూజారి (నవల)

పూజారి 1952 సంవత్సరంలో ప్రచురించబడిన మునిపల్లె రాజు రాసిన నవల. ఈ నవల ఆధారంగా బి.ఎన్ రెడ్డి పూజాఫలం అనే సినిమాను నిర్మించాడు. అది 1964 జనవరి 1న విడుదలైంది.

కథ

ఒక ఊరిలో పార్క్ ఉంటుంది. దానీ బాగోగులు ఎవరూ పట్టించుకోరు. పెద్ద జమీందారు ఏకైక వారసుడైన మధుకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. తాత అతన్ని పెంచి పెద్ద చేస్తాడు. ఆయనకు క్షయ వ్యాధి సోకి మదనపల్లె శానిటోరియం, నీలగిరి కొండల్లో కాలం గడుపుతుంటాడు. గుమాస్తా రామకృష్ణయ్య, నౌకరు రంగప్ప అతన్ని చూసుకుంటూ ఉంటారు. ఆస్తి, సంరక్షణ ఉన్నా బాల్యం ఒంటరిగా గడపటం వల్ల, స్వతహాగా దిగులు మనస్తత్వం కలవాడవటం వల్ల మధుకు మనశ్శాంతి ఉండదు.

మధుకు సంగీతం పట్ల ఆసక్తి, అభిరుచి ఉంటుంది. కాలేజీకి వెళ్ళి చదువుకునే అవసరం లేకపోయినా క్రమం తప్పకుండా వెళ్ళి చదువుకుని వస్తుంటాడు. తనకున్న పెద్ద ఇంటి కింది భాగాన్ని ఒక బ్యాంకు మేనేజరుకు అద్దెకిస్తాడు. ఆయన కూతురు ప్రీతితో మధు ప్రేమలో పడతాడు. మధుకి పట్నం చదువు దగ్గర శ్రీరాం అనే మరో స్నేహితుడు పరిచయమవుతాడు.

కొన్నాళ్ళకు బ్యాంకు మేనేజరుకు మరో ఊరికి బదిలీ కావడంతో ప్రీతి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. గుమాస్తా రామకృష్ణయ్యకు సుశీల అనే కుమార్తె ఉంటుంది. ఆమె మధును మౌనంగా ఆరాధిస్తుంటుంది. ప్రీతి వెళ్ళిపోయిన తరువాత తన తాత కూడా మరణించడంతో, ఆస్తి గురించిన తగాదాలతో మధు మరింత కృశించిపోతాడు. రామకృష్ణయ్య కూడా మంచమెక్కడంతో సుశీలనే ఇంటిని, మధును సంరక్షిస్తుంది. ఆమె సౌశీల్యానికి మెచ్చి మధు ఆమెను అర్ధాంగిగా చేసుకుంటాడు.

కొన్నాళ్ళపాటు మధు నీలానాగిని అనే వేశ్యాలోలత్వంలో పడి ఆస్తి, డబ్బు, నగలు కరిగిపోతాయి. కొన్నాళ్ళకి సుశీల ఏడోనెలలోనే ఒక కూతురుకు జన్మనిచ్చి తను మరణిస్తుంది. కొద్ది రోజులకు ఆ పాప కూడా మరణిస్తుంది. మధు యాధృచ్చికంగా శ్రీరాం దగ్గరకు చేరి ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటాడు. ఆ తరువాత తన ఆస్తినంతా శ్రీరాం పరిశోధనలకు రాసిచ్చి తను దేవాలయంలోకి వెళ్ళిపోతాడు.

మూలాలు

  • చతుర నవలావలోకలం-4, పూజారి - వి. రాజారామమోహనరావు - ఫిబ్రవరి 2014
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.