పీఠిక

పీఠిక ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన ప్రక్రియలలో ఒకటి. విమర్శలో ఒక భాగం. చార్లెస్ పిలిప్ బ్రౌన్‌ వంటి పాశ్చాత్యుల కృషి వలన, పాశ్చాత్య భాషా సాహిత్యాల పరిచయం వలన గ్రంథ పరిష్కరణ, ప్రచురణలకు అనుబంధంగా అభివృద్ధి చెందిన ప్రక్రియ ఇది.

పీఠిక- పర్యాయపదాలు

పీఠికకు పర్యాయపదాలుగా అభినందన, అవతారిక, ఆముఖం, ఆశంస, ఆశీస్సు, ఉపోద్ఘాతం, భూమిక, మంగళశాసనం, ప్రవేశిక, పరిచయం, యోగ్యతాపత్రం, విజ్ఞప్తి, నివేదన, మొదలగు సంస్కృతపదాలు, మున్నుడి, తెలివిడి, తొలిపలుకు, మనవి, ఒక మాట, రెండు మాటలు, ముందుమాట మొదలగు తెలుగు మాటలు వాడుతున్నారు[1]...

పీఠిక- నిర్వచనం

గ్రంథం మొదట రాసిన దాని పుట్టు పూర్వోత్తరాలు అని శబ్దరత్నాకరం నిర్వచించింది. గ్రంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా మరొకరు రాసే పరిచయ వాక్యాలనే పీఠిక అంటారు[2].

పీఠిక - పరిణామ క్రమం

పీఠికలు ప్రాచీన సాహిత్యంలో అవతారికలుగా అవతరించాయి. తరువాత నాటకాలలో ప్రస్తావనలతో ప్రస్థానాన్ని ప్రారంభించాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక పీఠికలు అవతరించాయి.

పీఠికలు- రకాలు

  1. కవిత్వ పీఠికలు
  2. నాటక పీఠికలు
  3. సృజనాత్మక వచన రచనా పీఠికలు
  4. లక్షణ గ్రంథ పీఠికలు
  5. పరిశోధన, లక్షణ గ్రంథ పీఠికలు
  6. శాస్త్ర సంబంధ గ్రంథ పీఠికలు

పీఠికలు- రచయితలు

గ్రంథాలకు పీఠికలను ఆ గ్రంథ రచయితలు, ప్రచురణ కర్తలు, గ్రంథ పరిష్కర్తలు, సంపాదకులు లేదా మరో రచయిత రాస్తుంటాడు.

పీఠికలు- వివిధ నామదేయాలు

తెలుగు సాహిత్యం పీఠికలకు ఒక్కొక్కరు లో ఒక్కో పేరు తో వ్రాయడం చూడగ్గలం.

మహాప్రస్థానానికి ముందుమాట రాసిన గుడిపాటి వెంకటా చలం  “యోగ్యతాపత్రం” అనగా, “దర్గామిట్ట కథలు” పుస్తకానికి ముళ్లపూడి వెంకటరమణ “ముబారక్” అనే శీర్షిక ను ఇచ్చారు.వేటూరి సుందరరామమూర్తిని వ్రాయమంటే  “బాలసరస్వతీ స్తుతి” అనే ముందుమాట ను  వల్లూరి విజయహనుమంతరావు తెలుగు సినీ గీతాల సంకలనం  “తెలుగు చిత్ర సరస్వతి” కి ఇవ్వడం జరిగింది. తిరుమల రామచంద్ర తన గ్రంథానికైనా, ఇతరుల గ్రంథానికైనా ముందుమాటలు వ్రాయవలసివస్తే వాటికి మనవిమాటలని శీర్షిక ఉంచేవారు. “అమరావతి కథల”కు ముళ్ళపూడి వెంకటరమణ ముందుమాట వ్రాస్తూ “అమరావతీ కథల-అపురూప శిల్పాలు” అన్నారు. సహస్రావధాని కోట లక్ష్మీనరసింహం “నమశ్శతి” అన్న కావ్యం వ్రాసి వారి గురువు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారిచే ముందుమాట వ్రాయించారు. కడిమెళ్ళ వారు ముందుమాటకు పెట్టిన శీర్షిక “మా బంధం అవ్యాజం కాదు”.

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం(మార్క్స్ ’కాపిటల్ ని ఆధారం చేసుకొని రాసిన పాఠం) పుస్తకానికి రంగనాయకమ్మ ముందుమాట అని, తెలుగు అనువాదం కాపిటల్ గ్రంధాని కి ’పరిచయం’ అని వ్రాసారు.

భానుమతి రామ కృష్ట్ణ రాసిన అత్తగారి కధలు పుస్తకానికి పి.వి.రాజమన్నారు ’తొలి పలుకు’ గా పీఠిక నిచ్చారు.ఎపిజె అబ్దుల్ కలాం ,అరుణ్ కె తివారి కలసి రాసిన ’ఈ మొగ్గలు వికసిస్తాయి నా మాటలు నిజమౌతాయి’ కి కలాం ’ముందుమాట’ ను రాస్తే, చివరి మాట గా ’ధన్యవాదాలు’ అంటూ అరుణ్ కె తివారి పంచుకున్నారు.పుచ్చలపల్లి సుందరయ్య తన జీవితగాధ ను ’విప్లవపధం లో నా పయనం’ అనే గ్రంధానికి ’మా మాట’ అని ప్రచురణ కర్తలే ముందుమాట ను రాసారు.బంగారుబాట శీర్షికన డా,, బి.వి.పట్టాభిరాం విరచిత ’కళాకారులు’ సంకలనానికి ’నా మాట’ గా ఆయన భావాల్ని తెలియజేసారు. [3]

 

ముందుమాటల విలువను అర్థం చేసుకోవాలంటే భారతరాజ్యాంగ ప్రవేశికకున్న విలువను గుర్తుచేసుకుంటే సరి. ప్రవేశిక ఒక విధంగా పీఠికే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగానికి నిడివిలో అతి చిన్నదైన ప్రవేశిక సారాంశంగా భాసిస్తోంది. దానిలో ఒక్కొక్క పదానికీ దేశచరిత్రకున్నంత లోతూ, దేశభవిష్యత్తుకున్నంత శక్తీ ఉన్నాయి. అలానే సాహిత్యంలో పీఠికదీ పెద్దపీటే వ్రాసేవారి సత్తాను బట్టి.[4]

అత్యధిక ముందుమాటలు

యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.[5] .ముందు మాటలను మరళా సంకలనాలు గా తీసుకువచ్చిన ఘనతా ఈయనదే. విలోకనం అనేది వీరి మూడో ముందుమాటల సంకలనం.

compilation of prefaces

పీఠిక - ప్రయోజనాలు

పీఠిక గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పాఠకునికి తోడ్పడుతుంది. రచనకు పాఠకునికి మధ్య వారథిగా నిలుస్తుంది. గ్రంథ సారాన్ని సూచన ప్రాయంగా పాఠకునికి అందిస్తుంది. గ్రంథపఠనానికి ప్రేరణను కలిగిస్తుంది.

ఈ ముందు మాటలలో కవుల పరిచయం కన్నా, కవిత్వ స్వరూప స్వభావాలపైన,కవిత్వ పరిణామాలపైనా, సమీక్ష ఎక్కువగా ఉంటుంది.. ప్రాచీన గ్రంధాలకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకర శాస్త్రి, జయంతి రామయ్య పంతులు, చిలుకూరి పాపయ్య శాస్త్రి,  మొదలయిన వారు రచించిన ముందు మాటలు సిద్దాంత వ్యాసాల స్థాయిలో,విశేషమయిన వివేచనతో కూడుకుని ఉండేది.. అలాగే విశ్వనాధ, తల్లవజ్జుల, పింగళి లక్ష్మి కాంతం, నిడదవోలు వెంకటరావు, దేవులపల్లి, మొదలయిన వారివి ఎంతో సాహితి విలువలను కలిగి ఉంటాయి..[6]

మూలాలు

  1. తెలుగు సాహిత్య ప్రక్రియలు, దోరణులు, రచన: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు, హిమకర్ ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-221
  2. వదరుబోతు, తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు, 2006, పుట- 84
  3. ఆయా గ్రంధా ల ముందు మాటల నుండి సేకరణ
  4. “తెలుగు సాహితీ సమాఖ్య”  40వ వార్షికోత్సవం సందర్భంగా వేసిన “మధుమంజరి-వార్షిక సాహిత్య సంచిక” అక్టోబరు 2012 లో ప్రచురించబడింది.   
  5. సారంగ పత్రికలో ప్రచురింపబడింది
  6. సుజనరంజని 10 నవంబరు సిలికానాంధ్ర
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.