పాల్కురికి సోమనాథుడు
పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య బ్రాహ్మణ కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.

పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారమని వీరశైవ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అప్పటి ఇతర బ్రాహ్మణ శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.
సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. వీరశైవ దీక్షను తీసుకున్న వారిని వీర మహేశ్వర వ్రతులంటారు. వారికి కులగోత్రాల పట్టింపు ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదలి శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు. వీరు జంగమ దేవరలుగా పరిగణింపబడతారు.
రచనలు
- తెలుగులో
- బసవ పురాణం[1]
- వృషాధిప శతకం
- చతుర్వేద సారము[2]
- పండితారాధ్య చరిత్ర
- చెన్నమల్లు సీసాలు, గద్యలు, ఉదాహరణలు, పంచకాలు, అష్టకాలు, స్తవాలు
- సంస్కృతంలో
- సోమనాధ భాష్యం
- రుద్ర భాష్యం
- సంస్కృత బసవోదాహరణలు
- వృషభాష్టకం
- త్రివిధ లింగాష్ఠకం
- కన్నడంలో
- సద్గురు రగడ
- చెన్న బసవ రగడ
- బసవలింగ నామావళి
రచనా శైలి
సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. "రగడ" అనే ఛందోరీతి ఇతనే ప్రారంభించాడు. ఇతడు మొదలుపెట్టిన రగడను "బసవ రగడ" అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసము, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదము, వన మయూరము, చతుర్విధ కందము, త్రిపాస కందము వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.
కళారూపాలు
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, కాకతీయ యుగం లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణంలొను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- భారత డిజిటల్ లైబ్రరీలో ద్విపద బసవ పురాణము పూర్తి పుస్తకం.
- సోమనాధుడు, పాల్కురికి. చతుర్వేద సారము.
వనరులు
- వేపచేదు విద్యాపీఠం వెబ్సైటులో వేపచేదు శ్రీనివాసరావు రచన
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)