పారిజాతం

పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయుదురు. తాజా ఆకుల రసమును పిల్లలకు భేదిమందుగా వాడెదరు.

పారిజాతం చెట్టు (Nyctanthes arbortristis)
పారిజాతం
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: లామియేలిస్
కుటుంబం: ఓలియేసి
జాతి: నిక్టాంథిస్
ప్రజాతి: N. arbortristis
ద్వినామీకరణం
Nyctanthes arbortristis
లిన్నేయస్

పురాణములలో

శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకము నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగా పారిజాతాపహరణం కథ నడిచింది.

శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.