పరమేశ్వరుడు

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.
ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు.
జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది.
శివుడు త్రినేత్రుడై, భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది.
పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన కుమారస్వామి ఆరు ముఖములు కలవాడు.
విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము, శివ సదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగాడుతూ ఉంటాయి.
పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్న సత్యాన్ని పైవిషయం ప్రబోధిస్తుంది.
నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు.
అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,
విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణవచనం.

పరమేశ్వరుడు


మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే... నమఃశివాయ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.