పన్నాలాల్ పటేల్

పన్నాలాల్ పటేల్ (ఆంగ్లం: Pannalal Patel; గుజరాతీ: પન્નાલાલ પટેલ) (1912 మే 7 - 1989 ఏప్రిల్ 6) ప్రముఖ గుజరాతీ భాషా రచయిత. ఆయన సాహిత్యకృషికి గాను ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు.

పన్నాలాల్ పటేల్
Pannalal Patel
పుట్టిన తేదీ, స్థలం (1912-05-07) 1912 మే 7
Dungarpur, రాజస్థాన్
మరణం 1989 ఏప్రిల్ 6 (1989-04-06)(వయసు 76)
Ahmedabad, గుజరాత్, భారత దేశము
వృత్తి నవలా రచయిత
జాతీయత భారతదేశం

వ్యక్తిగత జీవితం

పన్నాలాల్ పటేల్ పూర్తిపేరు పన్నాలాల్ నానాలాల్ పటేల్. ఆయన గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మండ్లి గ్రామం (దుంగార్ పూర్, రాజస్థాన్) లో 1912 మే 7 జన్మించారు. ఇడార్ (గుజరాత్) లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు. పాఠశాలలోనే ప్రముఖ గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్ కు సహాధ్యాయిగా ఉండేవారు. ఆయన పలు వృత్తులు చేపట్టినప్పటికీ అనతికాలంలోనే మద్యం ఫాక్టరీల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.

రచన రంగం

పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో ప్రఖ్యాత కథకునిగా, నవలారచయితగా పేరుపొందారు. నవలా రచనలోనే కాక, కథానిక-నాటక రచనలలో కూడా సమానకీర్తిని ఆర్జించారు. ఆయన రచనలలో మళేలా జీవ్, మానవీనీ భవాయీ మొదలైన నవలలు, సుఖ్ దుఃఖ్ నా సాధీ, దిల్ నీ వాత్ తదితర కథాసంపుటాలు, జమాయీ రాజ్ (ఏకాంకిక) మొదలైనవి ప్రధానమైనవి. పన్నాలాల్ పటేల్ రచనల్లో మానవుని కాంక్షకు, సమాజంలోని కట్టుబాట్లకు, విధి సృష్టించిన ఘటనలకు మధ్య జరిగే సంఘర్షణ ప్రధానమైనది అని దర్శక్ మొదలైన గుజరాతీ విమర్శకులు పేర్కొన్నారు. గ్రామీణ జీవనంలోని సుఖదుఃఖాలను, మారుతున్న కాలమాన పరిస్థితులు జీవితాలపై చూపే ప్రభావాలను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.

రచనల జాబితా

  • మలేళా జీవ్
  • మానవీనీ భవాయ్
  • ఫకీరో
  • భాంగ్యా న భేరు
  • నవున్ లోహి

శైలి

పన్నాలాల్ పటేల్ రచనల్లో గ్రామజీవనంలోని ఆచార వ్యవహారాలు, పంటలు క్షామాలు, నీతి అవినీతులు వంటివాటిని ప్రతిబింబించారు. ప్రముఖ గుజరాతీ సాహిత్యవిమర్శకులు దర్శక్ పన్నాలాల్ రచనల గురించి మాట్లాడుతూ పాత్రల వ్యక్తిగత కష్టాలనే కాక వాటి నుంచి కాలచక్రంలోని మార్పులను, వాటికి ఆధారకేంద్రాలైన స్థానాలను నవలల ద్వారా చూపగలిగారని పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యకలాపాల వల్ల లభించే సుఖదుఃఖాల కన్నా సాంఘిక కార్యకలాపాల వల్ల లభించే కష్టసుఖాల పరిమాణం పెరుగుతుందని, ఈ అంశాన్ని పన్నాలాల్ పటేల్ నవలల్లో చిత్రీకరించారని వారు వివరించారు. అశాంతి, దోపిడీ, దైవ అననుకూలత వల్ల వచ్చే ఆపదలు, షావుకార్ల ఒత్తిడి, రాచరికం, ధనమదం వీటన్నిటి పదఘట్టనల కింద నలుగుతూ, ఎప్పుడూ వాటి వల్ల బాధపడుతూ కూడా బతుకుపై మమకారంతో ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితం గడిపే పల్లెటూరి కష్టజీవుల కథలను ఇతివృత్తంగా స్వీకరించారని విమర్శకులు పేర్కొన్నారు.

పురస్కారాలు, గుర్తింపు

మానవీనీ భవాయీ నవలకు గాను పన్నాలాల్ పటేల్ కు 1985 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న రెండవ గుజరాతీ సాహిత్యవేత్తగా ఆయన కీర్తిగడించారు. 1950లో గుజరాతీ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారంగా ప్రఖ్యాతి పొందిన రంజిత్ రాం సువర్ణ చంద్రక్ (రంజిత్ రాం బంగారు పతకం) పొందారు. పన్నాలాల్ పటేల్ రచించిన వళా మణా (వీడ్కోలు), మళేలా జీవ్ (ప్రియ జనులు) నవలలను చదివిన తన్మయత్వంలో ప్రముఖ గుజరాతీ సాహిత్యవేత్త ఝవేర్ చంద్ మేఘాణీ ఆ నవలల విశిష్టతను తెలుపుతూ వ్యాసాలు రచించారు.

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.