నిర్వచనోత్తర రామాయణం

నిర్వచనోత్తర రామాయణము తొలి తెలుగు ప్రబంధముగా ఖ్యాతిగాంచినది. హిందూ పురాణమైన రామాయణం ఆధారం చేసుకొని, దీనిని తిక్కన రచించాడు.

ఈ కావ్యంలోని పది ఆశ్వాసాలలో 1280 పద్యాలు ఉన్నాయి.[1]

కథాసంగ్రహం

అయోధ్యకు మహారాజైన దశరథునికి శ్రీరామాదులు నలుగురు పుత్రులు జన్మించారు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడాడు. సీతాలక్ష్మణులతో వనవాసం చేస్తూ, శూర్పణఖ గర్వమణచి, రావణకుంభకర్ణాదుల్ని వధించాడు. ఆ మహానుభావుడు అగ్ని దేవతా సన్నిధిని సీతను పరిగ్రహించి, విభీషణ సుగ్రీవ వాయునందనుల్ని ఆదరించి, దేవేంద్రాదులచే స్తుతింపబడి, లక్షణుడు పుష్పక విమానం తేగా అందులో సీతాసమేతుడై సపరివారంగా అయోధ్యా పట్టణానికి సంతోషంగా వెళ్లి, ప్రజల మన్ననలు పొంది, రాజ్యపాలన చేశాడు.

శ్రీరాముని కొలువుకూటానికి జనకాదులు వచ్చారు. అగస్త్యుడు శ్రీరామునికి విశ్రవసువు, వైశ్రవణుడు, సుకేతువు, మాల్యవదాదులు, రావణకుంభకర్ణ విభీషణుల వృత్తాంతం తెలిపాడు.

సీతారాములు ఉద్యాన జలవిహారాలు సల్పారు. సీతాదేవి గర్భవతి అయింది. శ్రీరాముడు లోకాపవాదభీతిచే, సీతను అడవిలో విడువమన్నట్లు లక్షణుడామెతో చెప్పాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి మునిపత్నుల కప్పగించాఅడు.

శ్రీరాముడు అశ్వమేధయాగం చేశాడు. కుశలవులు యాగశాలలో రామాయణం గానంచేసి, శ్రీరామునిచే సన్మానించబడ్డారు. వాల్మీకి శ్రీరామునికి సీత వృత్తాంతం చెప్పి కుశలవుల్ని అతనికి అప్పగించాడు. సీత తన పాతివ్రత్య మహిమచే భూమిలో ప్రవేశించింది. శ్రీరాముడు లవకుశుల్ని అయోధ్యకు తీసికొనిపోయి రాజవిద్యలు నేర్పించాడు. శ్రీరామచంద్రుడు సకల జనానందకరంగా రాజ్యపాలన గావించాడు.

మూలాలు

  1. నిర్వచనోత్తర రామాయణము, తిక్కన, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా.ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 1-8.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.