ద్విపాత్రాభినయం

ఒక ప్రదర్శన (సినిమా లేదా నాటకము) లో ఒకే నటుడు లేదా నటి రెండు పాత్రలను ధరించడాన్ని ద్విపాత్రాభినయం అంటారు. ఇది దక్షిణభారత సినీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ.

బహుశా ఈ సంప్రదాయం నాటకాలు వేసే కాలంలో వేర్వేరు పాత్రలు పోషించడానికి సరిపడా ప్రతిభ గల నటులు లేనప్పుడు అవసరార్ధం ప్రారంభమై ఉండ వచ్చును. ఇంకా మన జానపద కళారీతులలో ఒకే కథకుడు లేదా పాటగాడు వేర్వేరు పాత్రల సంభాషణలను వేర్వేరు హావభావాలతో చెప్పడం కూడా సర్వ సామాన్యం.

నాటకాలలో ఈ ప్రక్రియ వాడినప్పుడు ఇద్దరు పాత్రధారులూ ఒకేసారి రంగం మీదకి వచ్చే అవకాశం లేదు. ఒక పాత్ర ముగిసిన తరువాత అదే నటుడు మరొక పాత్ర ధరించేవాడు.

సినిమాలలో ఈ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొంది. ఎందుకంటే ఒకే ఫ్రేములో రెండు పాత్రలనూ చూపే అద్భుతాన్ని ఛాయాగ్రాహకులు సాధించారు గనుక. తెలుగు సినిమాలలో ఇది దర్శకులకూ, నటులకూ, ప్రత్యేకించి ఛాయాగ్రాహకులకూ ఒక సవాలు అయింది. కొన్ని చోట్ల హీరోయిజాన్ని సమతుల్యం చేయడానికీ, మరి కొన్నిచోట్ల కథలో అనుకోని మలుపులు తిప్పడానికీ, కొన్నిచోట్ల నాయకుని ప్రతిభను బహుముఖంగా ప్రదర్శించడానికీ ఈ ప్రక్రియ వాడ బడింది. కవలపిల్లల పాత్రలు ఈ అభినయానికి పట్టుగొమ్మలైనాయి. తెలుగు దర్శకులు ఈ ప్రక్రియతో ఎన్నో ప్రయోగాలు చేశారు.

భారతీయ సినిమాలలో తొలి ద్విపాత్రాభినయము 1923 లో విడుదలైన మూకీ చిత్రము, పత్నీ ప్రతాప్లో నటి, పేషన్స్ కూపర్ చేసినది.

ద్విపాత్రాభినయాన్ని మరికాస్త విస్తరిస్తే మూడు, నాలుగు .. ఇలా ఎన్ని పాత్రలైనా ధరించవచ్చును. తమిళంలో శివాజీ గణేశన్ 9 పాత్రలు ఒకే సారి ధరించారు. తెలుగులో నందమూరి తారక రామారావు సినిమా దానవీరశూరకర్ణ ఈ విధమైన బహుపాత్రాభినయంలో ఒక మచ్చుతునక.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.