దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.

దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరాలయం

ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు.ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.

గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.

క్షేత్ర ప్రాశస్త్యం

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది.

తిరుమలవరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.

ఉత్సవాలు

దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు.

"కాదనకు నామాట కడపరాయా నీకు

గాదెవోసే వలపులు కడపరాయా

కలదాననే నీకు గడపరాయా వో

కలికి శ్రీ వేకటాద్రి కడపరాయ"

తాళ్ళపాక అన్నమాచార్యులు

మూలాలు, వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.