దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. విజయవాడలో కీలక నేతగా ఈయనకు పేరుంది. కంకిపాడు నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఒకసారి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత తెలుగు దేశం పార్టీలో చేరాడు. తరువాత కొద్ది రోజులు కాంగ్రెస్లో ఉండి మళ్ళీ తెలుగు దేశంలో చేరాడు.

దేవినేని నెహ్రూ
జననందేవినేని రాజశేఖర్
(1954-06-22) 1954 జూన్ 22
కంకిపాడు మండలం, నెప్పల్లి
మరణం2017 ఏప్రిల్ 17 (2017-04-17)(వయసు 62)
వృత్తిరాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిలక్ష్మి
పిల్లలుఅవినాష్ (కొడుకు), కుమార్తె
తల్లిదండ్రులు
  • దేవినేని రామకృష్ణ వరప్రసాద్ (తండ్రి)
  • రాధాకృష్ణమ్మ (తల్లి)

వ్యక్తిగత జీవితం

ఆయన అసలు పేరు దేవినేని రాజశేఖర్. ఆయన 1954 జూన్ 22 న విజయవాడ సమీపంలోని కంకిపాడు మండలం, నెప్పల్లిలో దేవినేని రామకృష్ణ వరప్రసాద్, రాధాకృష్ణమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు. ఆయన అన్న గాంధీ (రాజశేఖర్), తమ్ముళ్ళు మురళీ, బాజీప్రసాద్. బి. ఎ. వరకు చదివాడు. తరువాత కొన్నాళ్ళు వ్యవసాయం చేశాడు. తర్వాత ఆయనకు లక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక అబ్బాయి (అవినాష్), అమ్మాయి ఉన్నారు.[1]

ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తండ్రి సూర్యనారాయణ నెప్పల్లి సర్పంచిగా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

నెహ్రూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. చదువుకుంటున్నప్పుడే వంగవీటి రాధా సహాయంతో యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే సంస్థను స్థాపించాడు. 1979 వరకు ఈ సంస్థలో ఇద్దరూ కలిసి పనిచేశారు. తర్వాత వారిద్దరికీ విబేధాలు రావడంతో నెహ్రూ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించాడు. దాంతో ఈ రెండు సంస్థల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పోరాటంలో నెహ్రూ 1979లో తన అన్న గాంధీని కోల్పోయాడు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించిన నెహ్రూ మొదటగా ఎన్. టి. ఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖా మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం విడిపోయినప్పుడు ఎన్. టి. ఆర్ వర్గానికి అండగా నిలబడ్డాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2004 లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009 మరియు 2014 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందాడు. మళ్ళీ తెలుగు దేశం పార్టీకి దగ్గరయ్యాడు.

మరణం

కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ 2017, ఏప్రిల్ 17 సోమవారం ఉదయం 5 గంటలకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[2]

మూలాలు

  1. "ఇదీ.. నెహ్రూ రాజకీయ ప్రయాణం!". eenadu.net. ఈనాడు. Archived from the original on 17 April 2017. Retrieved 17 April 2017.
  2. "దేవినేని నెహ్రూ కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 17 April 2017. Retrieved 17 April 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.