తొండమాన్ చక్రవర్తి

తొండమాన్ చక్రవర్తి లేదా తొండమానుడు శ్రీ వేంకటేశ్వరుని ప్రియభక్తుడు. ఆకాశరాజు సోదరుడు. తిరుమలలో స్వామికి ఆనంద నిలయం కట్టించిన ప్రసిద్ధుడు. స్వామివారి వివాహానంతరం తొండమానుడు రాజ్యం పంచుకొని 'తొండమండలం' అన్న పేరుతో పాలించిన చారిత్రక పురుషుడు. వీని రాజధాని "కోట" అన్న ప్రాంతమే నేడు శ్రీకాళహస్తికి 8 కి.మీ.ల దూరంలో తొండమనాడు గ్రామంగా వ్యవహారంలో ఉంది.

తొండమానుడు ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవటానికి సొరంగమార్గం ఏర్పాటు చేసుకున్నాడు. వృద్ధాప్యం మూలంగా అది కష్టమని స్వామినే తన కోటలో వెలిసేటట్లు వరం పొందాడు. తిరుమలలోని ఆకాశగంగ తీర్థంతో జరిపే అభిషేకం స్వామివారికి ప్రీతిపాత్రం కనుక విశాలమైన చెరువు తవించి కపిలతీర్థం, ఆకాశగంగ కాలువల ద్వారా చెరువులోనికి చేరే ఏర్పాటు చేశాడు. ఈ చెరువే 'తామరగుంట'గా ప్రసిద్ధి చెంది ఆలయానికి సమీపంలో నెలకొని స్వామివారి అభిషేకానికి ఉపయోగపడేది. చాలా కాలం వరకు తామరగుంట జలంతో స్వామివారికి అభిషేకం జరపటం ఆనవాయితీగా రూపొందింది.

తొండమానుడు చేసిన ఏర్పాటుకు శ్రీవారు సంతోషించి ఇచ్చిన మాటా ప్రకారం తన ఇద్దరు దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా తొండమానుని కోటలో వెలిశారు. ఆ కాలంలో తొండ మడల ప్రాంతమంతా తమిళ భాష మాట్లాడే ప్రజలు అధికంగా నివసించడం చేత స్వామివారిని "వీటిల్ ఇరందు రాయ్ పెరుమాళ్"గా పిలిచేవారు.

మూలాలు

  • తొండమనాడు ఆలయం: మధుర చంద్రశేఖరరావు, సప్తగిరి ఫిబ్రవరి 2008 పత్రికలో వ్రాసిన వ్యాసం ఆధారంగా
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.