తుంగభద్ర

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.

ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది
కర్నూలు వద్ద తుంగభద్ర నదిపై రైల్వే వంతెన

పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.

  • కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
  • భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

నదీ ప్రయాణం

శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం

కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ శిమోగా జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి శృంగేరి పీఠం, హంపి ల మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ (తెలంగాణ) వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.

తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడింది.

తుంగభద్ర పుష్కరాలు

పుష్కరాలు హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు 2008 డిసెంబర్ మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు మరియు తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. కర్నూలు, మంత్రాలయం, ఆలంపూర్ తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.