తి.తి.దే. పధకాలు

తిరుమల తిరుపతి దేవస్థానాలు వివిధ పధకాలు అమలుజరుపుతున్నారు.

శ్రీవారి పుష్పకైంకర్యము

పుష్పాంజలి పథకము

శ్రీనివాసునికి జరుగు నిత్య పుష్పాలంకరణ సేవలో పాల్గొన కోరు భక్తులు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పేరిట డిమాండు డ్రాఫ్టు తీసి వారి అభీష్టానుసారం వేయి రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరకు డబ్బు పంపినచో ఆ డబ్బును డిపాజిట్టు చేసి ఆ డబ్బుతో అత్యాధునిక గ్రీన్ హౌస్ కల్టివేషన్ పద్ధతులలో సువాసన కలిగిన పుష్పములు (గులాబి, చేమంతి, గన్నేరు, తామర, మల్లి, బంతిపూలు, మొగిలి, మొల్లలు, జాజులు, మరువము, దవణము, కనకాంబరాలు, నూరు వరహాలు) తిరుమల ఉద్యానవనములలో పెంచి భక్తులు కోరిన రోజు శ్రీవారికి పుష్పమాలలు వారి పేరుమీద సమర్పించబడును.

ప్రత్యక్ష పుష్ప కైంకర్యము

భక్తులు తమ శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చునప్పుడు వారే తమ కిష్టమైన విడి పుష్పములను 5 కిలోగ్రాములకు తగ్గకుండా ఎన్నైనా తెచ్చి తిరుమల గార్డెన్ ఆఫీసులో ఇచ్చి రసీదు పొందవచ్చును. ఆ పుష్పాలు ఆలయ అవసరాలకు తగినట్టు కట్టి ఆ భక్తుల పేరుమీద శ్రీవారికి కైంకర్యము చేయబడును.

పుష్ప వర్ధిని పధకము

పూదోట యజమానులు తాము పండించిన సీజను పుష్పాలను దేవుని పేర నేరుగా వారి ప్రాంతం నుండి తిరుమలకు బస్సులో పంపవచ్చును. దీనికి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.వారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు. అలా వచ్చిన పూలను తిరుమల గార్డెన్ ఆఫీసువారు తీసుకుని శ్రీ వేంకటేశునికి వినియోగిస్తారు. నర్సరీ యజమానులు తాము రూపొందించిన హైబ్రీడు పుష్పజాతి మొక్కలను తిరుమల దేవునికి సమర్పించిన అవి శ్రీవారి ఉద్యానవనాలలో పెంచబడి వాని పుష్పములు శ్రీవారికి కైంకర్యము చేయబడును.

ధార్మిక గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం

తి.తి.దే. చేస్తున్న ధార్మిక ప్రచురణలో భాగంగా రచయితలకు తమ ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా జరుగుతోంది. రచయితలు తమ ధార్మిక గ్రంథాల ముద్రణకు ఆర్థిక సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పంపవచ్చును. అలా వచ్చిన గ్రంథాలను నిపుణుల మండలి పరిశీలించి నిర్ణయిస్తారు.

  • వేదాలు, ఉపనిషత్తులు, ధార్మిక కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు, ఆగమాలు మరియు శ్రీనివాస సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
  • ఎమ్.ఫిల్., పి.హెచ్.డి. పరిశోధన గ్రంథాలను యధాతథంగా కాక పుస్తక రూపంలో తయారుచేసి పంపించాల్సి ఉంటుంది.
  • పరిశీలనకు పంపే గ్రంథాలు రచయితలే స్వయంగా పంపాల్సి ఉంటుంది. వారు మాత్రమే ఆర్థిక సహాయానికి అర్హులు.
  • గరిష్ఠ ఆర్థిక సహాయం 20,000 రూపాయలు అందజేస్తారు.

రాయితీపై రాతి విగ్రహాలు

తి.తి.దే. పాఠశాలలకు, కళాశాలలకు, ఆశ్రమాలకు, మఠాలకు మరియు ఇతర హిందూ సంస్థలకు దేవుళ్ళ విగ్రహాలను రాయితీపై సరఫరా చేయడం జరుగుతుంది.

అంబులెన్స్ ఉచిత సేవ

తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్యగాని, తిరుమలలోగాని అవసరమైనవారు ఉచిత అంబులెన్స్ సేవలను పొందవచ్చును. ఈ సేవలను బెంగుళూరుకు చెందిన సి.టి.సి.వారు అందుస్తున్నారు.

సంప్రదించవలసిన ఫోను నెంబరు: 0877-2251062

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.