తిరుమల మోకాళ్ళ పర్వతం

అలిపిరి నుంచి తిరుమలకు నడచి వెళ్ళే దారిలో ఉండే ఏడుకొండలలోని చివరి కొండలోని మొకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాళ్ళ పర్వతం అంటారు. మొకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారు 400 మెట్లు ఉండగా వాటిలో మొదటి వంద మెట్లు మామూలు మెట్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ మెట్ల వద్ద నడిచేటప్పుడు మోకాళ్ళపై ఎక్కువ భారం పడటం మరియు ఈ మెట్ల వద్ద భక్తులు మోకాళ్ళపై నడవటం వలన ఈ ప్రదేశాన్ని మోకాళ్ళ పర్వతం అంటారు.

తిరుమల మోకాళ్ళ పర్వతంలో గోపురం

అన్నమయ్య మొదటి సారి తిరుమలకు వచ్చినపుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెబుతుంటారు.
రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినపుడు ఈ వేంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకుని ఆ పవిత్రమయిన ప్రదేశాన్ని పాదరక్షలు/పాదాలతో తాకరాదని, మోకాళ్ళతోనే కొండ ఎక్కాడట. అప్పటి నుండి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీ అయింది. అన్ని మెట్లూ, వంద మెట్లు, పదకొండు మెట్లు , కనీసం మూడు మెట్లు మోకాళ్ళతో నడచి ఆ పాత సాంప్రదాయాన్ని నేటికీ భక్తులు తిరిగి పాటిస్తున్నారు. [1] 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు[2].

బయటి లింకులు

వనరులు

  1. దాశరథి రంగాచార్య గారి శ్రీ రామానుజ చరితామృతం పుస్తకం నుండి
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.