తిరుమల పుష్పయాగం

ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారు.

15వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబరు 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.

ఈ పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, మూడు రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామికి పూజ చేసారు.

దుర్భిక్ష నివారణకు పుష్పయాగం

ప్రకృతి వైపరీత్యాల నివారణ, రాజ్యం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున శ్రీ వెంకటేశునికి పుష్పయాగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి ఉన్న తాయార్లు, మలయప్పమూర్తులకు పాదాల నుంచి హృదయం వరకూ పుష్పాలతో మునిగేంతవరకు పుష్పారాధన చేస్తారు. తర్వాత ధూపదీప నీరాజనాలు సమర్పించి, పుష్పాలను పూర్తిగా తొలగించి వేస్తారు. ఇలా ఇరవై మార్లు సుమధుర సుగంధాలు విరజిమ్మే పుష్పజాతులతో ఈ పుష్పకైంకర్యం కన్నుల పండువగా నిర్వహిస్తారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

సాక్షి ఫన్‍డే - 2012 సెప్టెంబరు 16

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.