తిరుమల పవిత్రోత్సవం

పవిత్రోత్సవం తిరుమల దేవాలయం యొక్క పవిత్రతను, పరిశుభ్రతను అవధారణ చేయడానికి ఉద్దేశింపబడిన ఉత్సవము. పవిత్రోత్సవం అంటే సాధారణంగా శుద్ధీకరణ ప్రక్రియ. తిరుమల గర్భగుడి సమేతంగా ఆలయంలో సమస్త కోణాలను సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరున సుగంధ ద్రవ్యాలతో జరిగే శుద్ధీకరణ ప్రక్రియ భౌతికమైనది కాగా పవిత్రోత్సవం భావనాత్మకమైనది. స్వామివారి కైంకర్యంలో మంత్రదోష, క్రియాదోష, కర్తవ్య లోపాదులు ఉండరాదు అనే దృష్టికోణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఆలయ పూజాదికాలలో అనుదినం అనవధానంతో అవసరంతో లోటుపాటులు, మానవుడు అయినందువల్లనే జరుగుతాయి. ఇటువంటి మానవకృత దోషాలను పరిహరించుకోవడానికి పవిత్రోత్సవం జరుగుతుంది.

చరిత్ర

తిరుమల దేవాలయంలో పూర్వం పవిత్రోత్సవం నిర్వహింపబడినట్లు అనేక శాసనాల వలన తెలుస్తోంది. కానీ ఈ ఉత్సవం ఏ కారణం చేతనో నిలిచిపోయింది. తిరిగి 1962 సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని పునరుద్ధరించడం జరిగింది. నాటి నుండి కొనసాగుతూ వస్తుంది.

ప్రస్తుత ఉత్సవం

ఈనాడు పవిత్రోత్సవం శ్రావణమాసంలో ఏకాదశి నుండి త్రయోదశి వరకు మూడు రోజులు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ముందురోజు (అనగా దశమినాడు) అంకురార్పణ జరుగుతుంది. ఏకాదశినాడు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ద్వాదశినాడు ఉత్సవ మూర్తులకు పవిత్ర సమర్పణ, త్రయోదశినాడు పూర్ణాహుతితో ఉత్సవం ముగుస్తుంది. మలయప్ప స్వామికి, ఉభయ దేవేరులకు పవిత్రమాలలను వేసి ఊరేగించడంతో జరిగిన దోషం పరిహారమౌతుంది.

మూలాలు

  • పవిత్రోత్సవం, తిరుమల ఆలయము, డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి ఆగస్టు 2006 సంచికలో ప్రచురించిన వ్యాసం.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.