తాళ్ళపాక తిమ్మక్క

తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి. వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినది.

ప్రథమాంధ్ర భాషా కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. మహాకవి, వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య ఇల్లాలు తిమ్మక్క అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారి నిర్ణయం. ఈమె సుభద్రా కల్యాణం అనే కావ్యాన్ని రచించింది. సుభద్రా కల్యాణానికి ఆధారం నన్నయ భారతమే. నన్నయ ఆది పర్వంలో 135 గద్య పద్యాలలో విజయ విలాసం రచించాడు. అతనిని అనుసరిస్తూ తిమ్మక్క 1163 పాదాల ద్విపద కావ్యాన్ని రచించింది. కడుమంచి తేటపలుకులతో చెప్పిన పాటగా తన కావ్యాన్ని పేర్కొంది. కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయలాగానే మూలాతిక్రమణం చేసింది. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ - అమర అహోబళంబా వెంకటాద్రి వరుస నాపై కంచి వరదుల గొలిచె-అని తిరుపతి వెంకటేశ్వరులకు అర్జునునిచేత మొక్కులందించింది.

నన్నయ మహాభారతంలో లేని బావా మరదుల హాస్యం తిమ్మక్క సుభద్రా కల్యాణంలో నింపి రచించింది. సుభద్ర పాత్రను సమయోచితంగా తీర్చిదిద్దింది. సుభద్ర చేత ఈడుకు తగిన ఆటలు ఆడించింది. చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో తిమ్మక్కను అనుసరించాడు. సుభద్ర అర్జునుని వర్ణించిన సందర్భంలో రచించిన- "ఎగుభుజమ్ములవాడు మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు" - అన్న తిమ్మక్క రచనను చేమకూర వెంకటకవి - "ఎగుభుజములవాడు మృగరాజ మధ్యంబు పుదికి పుచ్చుకొను నెన్నడుమువాడు"- అనుసరించాడు. సుభద్రా కల్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన గ్రంథం అన్న విషయం కావ్యాన్ని చదివితే అర్థమవుతుంది. సుభద్రా కల్యాణాన్ని తిమ్మక్క రచించలేదన్న వాదోపవాదాలు పండితలోకంలో ఉన్నాయి.

తాళ్లపాక వంశవృక్షం

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.