తనికెళ్ళ భరణి
తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.[1]
| తనికెళ్ళ భరణి | |
|---|---|
![]() తనికెళ్ళ చిత్రపటం | |
| జననం | 1956 జూలై 14 |
| ఎత్తు | 5"7 |
| జీవిత భాగస్వామి | భవాని |

వ్యక్తిగతం
భరణి భార్య పేరు భవాని. వారికి మహాతేజ అనే కొడుకు, సౌందర్యలహరి అనే కుమార్తె ఉన్నారు.
కుటుంబం
తనికెళ్ళ భరణి తండ్రి టి.వి.ఎస్.ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. భార్య దుర్గాభవాని. ఒక కుమారుడు పేరు కన్నబాబు. ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి. ఆయన నిర్మించిన నివాసగృహానికి కుమార్తె పేరు పెట్టబడింది.
ఆరంభకాల కళాపయనం
తనికెళ్ళ భరణి ఇంటర్ వరకు ఏమీ వ్రాయలేదు. ఇంటర్ చదివేసమయంలో ఆయన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన " అగ్గిపుల్ల ఆత్మహత్య ", " కొత్త కలాలు " కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. తరువాత బి.కాం చదివే సమయంలో రాళ్ళపల్లితో పరిచయం అయింది. రాళ్ళపల్లి వ్రాసిన " ముగింపు లేని కథ " నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు " శ్రీ మురళీ కళానిలయం " . రాళ్ళపల్లి మద్రాసు వెళ్ళిన తరువాత " శ్రీ మురళీ కళానిలయం" సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కొరకు 10 నాటకాలు రచించాడు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించాడు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన " గోగ్రహణం " నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం ప్రత్యేకత. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది.
వీధినాటకాలు
ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ఉన్న రవీంద్రభారతి, నారద గానసభ వంటి నాటకరంగాలలో నాటకం వేయడానికి అధికంగా వ్యయం కావడం అది భరించే అవకాశాలు లేని కారణంగా భరణి పనిచేస్తున్న సంస్థ వారు బెంగాలీ నాటకకర్త " బాదల్ సర్కార్"ను ప్రేరణగా తీసుకుని వీధినాటకాలు వేయడం ప్రారంభించారు. ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటిది " పెద్దబాలశిక్ష " నాటకం. తలావఝుల సుందరం ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది. భరణి వీటిలో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు. భరణి రచించిన " గోగ్రహణం, కొక్కరకో, గొయ్యి " నాటకాలు తల్లవఝుల సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి అత్యధికంగా విలన్ పాత్రలు ధరించాడు.
చలనచిత్రరంగ ప్రవేశం
తనికెళ్ళ భరణి వ్రాసిన " చల్ చల్ గుర్రం " నాటకం చూసిన రామరాజు హనుమంతరావు ఆయనకు " కంచు కవచం " చిత్రానికి వచనకర్తగా అవకాశం ఇచ్చాడు. తరువాత " లేడీస్ టైలర్" చిత్రానికి వచనకర్తగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు వచనకర్తగా పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలగాణా యాసలో వచనం వ్రాయడంలో సిద్ధహస్థుడు. " మొండి మొగుడు - పెంకిపెళ్ళాం " చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలగాణాయాసలో వచనం వ్రాసి విజయం సాధించి తెలంగాణా యాసకు కావ్యగౌరవం కలిగించాడు.
నటుడిగా
తనికెళ్ళభరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు మరియు పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు. కామెడీ,విలన్ మరియు ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రదారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు. ఆయన దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించాడు.
పాక్షిక చిత్ర సమాహారం
దర్శకుడిగా
- మిథునం (2012)
నటించిన చిత్రాలు
- విజేత (2018 సినిమా) (2018)
- కథలో రాజకుమారి (2017)
- నేనే రాజు నేనే మంత్రి (2017)
- హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (2017)
- అరెరె
- బెంగాల్ టైగర్ (సినిమా) (2015)
- కార్తికేయ (సినిమా) (2014)
- రారా...కృష్ణయ్య (2014)
- పాండవులు పాండవులు తుమ్మెద (2014)
- ఢి ఫర్ దోపిడి (2013)
- క్షేత్రం (2011)
- కలెక్టర్ గారి భార్య (2010)
- బావ (సినిమా) (2010)
- రక్తచరిత్ర - రామ్మూర్తి - (2010)
- కరెంట్ (2009)
- నేనున్నాను - సింహాచలం నాయుడు - (2004)
- మిస్సమ్మ (2003)
- విష్ణు (2003)
- ఎంత బావుందో! (2002)
- మనసున్న మారాజు (2000)
- సర్దుకుపోదాం రండి (2000)
- శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
- స్వర కల్పన
- చెట్టు కింద ప్లీడర్
- శివ
- జగదేక వీరుడు అతిలోక సుందరి
- సీతారామయ్య గారి మనవరాలు
- అప్పుల అప్పారావు
- యమలీల
- నువ్వు నాకు నచ్చావ్
- మన్మథుడు
- ఇంద్ర
- చిత్రం
- చెవిలో పువ్వు (1990)
రచయితగా
నాటకాలు
- కొక్కొరోకో
- గార్థభాండం
- గోగ్రహణం
- చల్ చల్ గుర్రం
- జంబూద్వీపం
సినీ రచనలు
- శీను వాసంతి లక్ష్మి (2004)
- గాయం (1993)
- చెట్టుకింద ప్లీడర్ (1989)
- స్వరకల్పన (1989)
- వారసుడొచ్చాడు (1988)
- శ్రీకనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూపు (1987)
- అన్వేషణ (1985)
- లేడీస్ టైలర్ (1985)
ప్రజాదరణ పొందిన తనికెళ్ళ భరణి సినీ సంభాషణలు
- నన్ను గిట్ల డిసైడ్ చేసినావేందన్నో... (యమలీల సినిమా)
- ఆడు మగాడ్రా బుజ్జీ ... (అతడు)
పురస్కారాలు
- సముద్రం సినిమా కోసం ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం
రచనలు
- నక్షత్ర దర్శనం
- పరికిణీ
- ఎందరో మహానుభావులు
- మాత్రలు
- శబ్బాష్రా శంకరా
