జమ్మూ కాశ్మీరు

జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर جۄم تٕہ کٔشِیر, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమున్నది.

జమ్మూ కాశ్మీరు
Map of India with the location of జమ్మూ కాశ్మీరు highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
వేసవిలో శ్రీనగర్, తక్కిన సమయంలో జమ్ము
 - 34.08° ఉ 74.83° తూ
పెద్ద నగరము శ్రీనగర్
జనాభా (2001)
 - జనసాంద్రత
10,069,917 (18th)
 - 45.31/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
222,236 చ.కి.మీ (?)
 - 14
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1947-10-26
 - sathyapal malik
 - మోహబూబా ముప్తి
 - Bicameral (89 + 36)
అధికార బాష (లు) కాశ్మీరీ,ఉర్దు
పొడిపదం (ISO) IN-JK
వెబ్‌సైటు: jammukashmir.nic.in
జమ్ము శీతాకాలంలో రాజధాని

జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి.

  1. జమ్ము ప్రాంతం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా 'జమ్ము'యే. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం.
  2. కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి (వివరాలకు కాశ్మీరు వివాదం చూడండి)
  3. లడఖ్: ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం.

కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

చరిత్ర

1586లో అక్బరు చక్రవర్తి సైన్యం "రాజా భగవాన్ దాస్" నాయకత్వంలో కాశ్మీరు పాలకుడు యూసుఫ్ ఖాన్‌ని ఓడించింది. ఆప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు "రామచంద్ర" ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. "కచవా జాట్" రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత "జమ్‌వాయి మాత" పేరుమీద "జమ్ము" నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను "డోగ్రా రాజపుత్రులు" అంటారు.దేవోత్పతన నాయక్‌ అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ పాలకుడు కాశ్మీరు రాజు హర్ష దేవుడు .కల్హణుడు రాసిన రాజతరంగిణి అనే గ్రంథంలో దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించాడు.

1900 కాలంనాటి జమ్ము-కాశ్మీరు మహారాజా చిత్రం

తరువాత 19వ శతాబ్దంలో రాజపుత్రులనుండి జమ్ము ప్రాంతం మహారాజా రంజిత్ సింగ్ పాలనలోకి వచ్చి, సిక్కు రాజ్యంలో భాగమయ్యింది. మళ్ళీ మహారాజా గులాబ్ సింగ్ నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీరు, లడక్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్ము రాజులవశమయ్యాయి. 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం (Instrument of Accession) తో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది.


భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్) కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉంది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉంది.

భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

పరిపాలన

జమ్ము-కాశ్మీరు జెండా

భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీరు రాష్ట్రానికి "ప్రత్యేక ప్రతిపత్తి" ఉంది. కాశ్మీరులోని ఒక వర్గం మరింత ప్రత్యేక అధికారాలు కావాలని వాదిస్తారు. కాశ్మీరులోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు - జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ.

చాలా కాలం కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంతో కాశ్మీర్ రాజకీయాలు ముడివడి ఉన్నాయి. అతని అనంతరం అతని కుమారుడు ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాయకుడు. ప్రస్తుతం (2006లో) భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది."ఒమర్ అబ్దుల్లా " తరువాత జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధినేత "ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ " బీజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం 2015 మార్చి 1 న బాధ్యతలు స్వీకరించారు. 2016 జనవరి 7 న ఆరోగ్యం విషమించడంతో మరణించారు.తరువాత ప్రభుత్వం ఏర్పడినంత వరకు గవర్నర్ పరిపాలనలో ఉంటుంది.

భౌగోళికం, వాతావరణం

జమ్ము-కాశ్మీరు నైఋతి భాగంలో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్య ప్రాంతంలో తేమతోకూడిన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరభాగంలో వాతావరణం బాగా చల్లగా, తేమగా ఉంటుంది. కాశ్మీరు వాసుల జీవన విధానం అక్కడి భౌగీళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలచుకొన్నారు.

ఆర్ధిక వ్యవస్థ

మంచు కొడలతో నిండిన జమ్ము-కాశ్మీర్‌లో ప్రధాన రహదారుల నిర్మాణం చాలా కష్టం. ఈ ఫొటోలో కనిపించేది శ్రీనగర్ నుండి "లే"కు వెళ్ళే హైవే.

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రపు స్థూల ఆదాయం ప్రగతి క్రింది పట్టికలో చూపబడింది. ప్రభుత్వ గణాంకాలు. (కోట్ల రూపాయలలో)

సంవత్సరంరాష్ట్ర స్థూలాదాయం (కోట్ల రూపాయలు)
19801,186
19852,256
19903,614
19958,097
200014,750


వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి.

Kashmir Willow అనే చెక్కనుండి తయారు చేసే క్రికెట్ బ్యాటులు మంచి నాణ్యమైనవని పేరు. ఇంకా కాశ్మీరు కుంకుమ పువ్వు కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.

సంస్కృతి

కాశ్మీరు సరస్సులలోను, నదులలోను "షికారా"లు, "పడవటిళ్ళు" (Houseboats) సాధారణంగా కన్పిస్తుంటాయి
కాశ్మీరులో రహదారి ప్రక్కనున్న ఒక హిందూ మందిరం

కాశ్మీరు జీవనవిధానంలో ప్రధాన లక్షణం, (మతంతో సంబంధంలేకుండా) శాంతి, నిదానం. వారి సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సంప్రదాయాలు. ఆడ, మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే "దుమ్హల్" నృత్యం, ఆడువారు చేసే "రోఫ్" నృత్యం బాగా పేరుపొందాయి.

'బుల్ బుల్ షా' అనే సూఫీసాధువు 'రించాన్' అనే బౌద్ధరాజును మహమ్మదీయ మతానికి మార్చడంతో కాశ్మీరులో ఇస్లాంమత ప్రభావం ఆరంభమైనదని చెప్పవచ్చును. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

ఇంకా హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయి. ఉత్తరప్రాంతంలో కొద్దిమంది యూదు మతస్తులు ఉన్నారు. వీరు సిల్క్‌మార్గం (Silk Route) ద్వారా ఇజ్రాయిలు నుండి వలసవచ్చిఉండవచ్చును.

కాశ్మీరేతరులకు కాశ్మీరులో భూమి కొనుక్కొనే అవకాశం చట్టరీత్యా లేదు. కనుక ఈ సుందరప్రాంతంలో ఉండగోరిన పరాయి ప్రాంతపువారు "పడవటిళ్ళలో" (House Boats) ఉండటం ప్రత్యామ్నాయవిధానంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవనవిధానంలో ఒక అవినాభావ భాగమైంది. ఇప్పుడు చాలామంది కాశ్మీరీలు, కాశ్మీరేతరులు ఈ పడవటిళ్ళల్లో ఉంటారు.

జన విస్తరణ

కాశ్మీరులోయలో మతాల గణాంకాలు
ముస్లిములు 95%
హిందువులు, ఇతరులు 4%
జమ్ములో మతాల గణాంకాలు
ముస్లింలు 28%
హిందువులు 66%
సిక్ఖులు, ఇతరులు 4%
లడఖ్‌లో మతాల గణాంకాలు
ముస్లింలు 44%
బౌద్ధులు 50%
హిందువులు, ఇతరులు 5%

జమ్ము-కాశ్మీరు మొత్తంలో సుమారు 70% ముస్లిములు. మిగిలినవారిలో బౌద్ధులు, హిందువులు, సిక్కులు ఉన్నారు. లడఖ్ ప్రాంతపు ప్రజలు ఇండో-టిబెటన్ జాతికి చెందినవారు. జమ్ము దక్షిణప్రాంతవాసులు తమ మూలాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉన్నాయని చెప్పుకుంటారు.

1941వరకు కాశ్మీరు మొత్తం జనాభాలో 15%వరకు హిందువులు ఉండేవారు. 1947లో హిందువుల జనసంఖ్య 2,00,000-4,50,000 మధ్య అంచనా [1]. 1990 తరువాత పెచ్చుపెరిగిన తీవ్రవాదం వల్ల, హిందువులపై దాడులవల్ల అధికభాగం హిందువులు కాశ్మీరుప్రాంతాన్ని వదలి వలసపోవలసి వచ్చింది. ఇప్పుడు (2006లో) మొత్తం హిందూజనాభా 5,000-15,000 మధ్య ఉంటుందని అంచనా.[2].

జిల్లాలు

జమ్ము̲-కాశ్మీరులో మొత్తం 22 జిల్లాలు ఉన్నాయి. వాటిని జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ ప్రాంతంలోని జిల్లాలు: కత్వా, జమ్మూ, సాంబ, ఉధంపూర్‌, రైసి, రాజౌరీ, పూంఛ్‌, దోడ, రామ్‌బన్‌, కిష్టావర్‌ కాశ్మీర్‌ ప్రాంతంలోని జిల్లాలు : అనంతనాగ్‌, కుల్గాం, పుల్వామా, సోఫియాన్, బద్‌గావ్‌, శ్రీనగర్, గండర్‌బల్‌, బందీపుర, బారాముల్లా, కుప్వారా లడక్‌ ప్రాంతంలోని జిల్లాలు : కార్గిల్‌, లేహ్‌ నగర పాలక సంస్థలు-2 : శ్రీనగర్‌, జమ్మూ పురపాలక సంఘాలు-6 : ఉధంపూర్‌, కత్వా, పూంఛ్‌, అనంతనాగ్‌, బారాముల్లా, సోపోర్‌ నగర పంచాయతీలు - 21 సియాచిన్‌ గ్లేసియర్స్‌ భారత సైన్యం ఆధీనంలో ఉన్నప్పటికీ... అక్కడ ఎలాంటి ప్రభుత్వం లేదు.

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1ANఅనంతనాగ్అనంతనాగ్11700133984294
2BDబాద్‌గంబాద్‌గం5937681371433
3BRబారముల్లాబారముల్లా11667224588254
4DOదొడదొడ6904741169159
5JAజమ్ముజమ్ము15719113097508
6KRకార్గిల్కార్గిల్115227140368
7KTకతుయాకతుయా5442062651205
8KUకుప్వారాకుప్వారా6400132379269
9LEలెహ్లెహ్117637826651
10POపూంచ్పూంచ్3715611674222
11PUపుల్వామాపుల్వామా6322951398452
12RAరాజౌరీరాజౌరీ4785952630182
13SRశ్రీనగర్శ్రీనగర్12385302228556
14UDఉధంపుర్ఉధంపుర్7389654550162

పర్యాటక రంగం

శ్రీనగర్ నగరం, దాల్ సరస్సుల విశాల చిత్రం. కాశ్మీరు లోయ అందానికి భూతల స్వర్గంగా పేరు. "ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో" అని తెలుగు సినిమా పాట

కాశ్మీరును "భూతల స్వర్గం" అని అంటారు. 17వ శతాబ్దంలో ముఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమిమీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే అన్నాడు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గాఁవ్ - ఇవి కాశ్మీరులో ముఖ్యమైన పర్యాటక స్థలాలు.

భారతదేశంలో పర్యాటకులకు కాశ్మీరు అన్నింటికంటే ప్రధానగమ్యంగా ఉండేది. కాని ఇటీవల విజృంభించిన ఉగ్రవాద కార్యకలాపాలవల్లా, శాంతిభద్రతల సమస్యలవల్లా పర్యాటకులు బాగా తగ్గిపోయారు.

కాశ్మీరు వివాదం, వేర్పాటువాదం, సాయుధ పోరాటం

1947 నాటికి జమ్మూ-కాశ్మీరు ముస్లిములు అధిక సంఖ్యలో ఉండి, హిందూరాజు పాలనలో ఉన్న రాజ సంస్థానం. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి, దేశ విభజన జరిగినప్పుడు భారతదేశంలో చేరాలో, పాకిస్తాన్‌లో చేరాలో కాశ్మీరు రాజు నిర్ణయించుకొనలేకపోయాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే పాకిస్తాన్ వాయువ్యప్రాంతపు పఠానుతెగలవారు సరిహద్దుదాటి కాశ్మీరులో ప్రవేశించారు. స్థానికులను ప్రేరేపించి కాశ్మీరును పాకిస్తాన్‌లో విలీనం చేయించాలని వారి వ్యూహం. అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనికబలం లేదు. శాంతిభద్రతలు క్షీణించి, అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం అర్ధించాడు. తరువాత కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగా నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడు షేక్ అబ్దుల్లా కాశ్మీరు రాష్ట్రనాయకుడయ్యాడు.

గోధుమ రంగులో నున్నభాగం భారతదేశం అధీనంలో ఉంది. వాయవ్యాన పచ్చని రంగులో ఉన్న భాగం పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఈశాన్యాన చారలతో చూపబడిన ఆక్సాయ్‌చిన్ చైనా అధీనంలో ఉంది.

1948 జనవరిలో భారతసైన్యం కాశ్మీరులో ప్రవేశించి అరాచక మూకలను తరిమి, దానిని భారతదేశంలో భాగంగా చేసుకొంది. ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం కాశ్మీరుపై దండెత్తింది. అప్పుడు జరిగిన మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధవిరమణ ఒప్పందం ప్రకారం కొంత కాశ్మీరు భాగం పాకిస్తాన్ అధినంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ఆజాద్ కాశ్మీరు అని పాకిస్తాన్‌లో అంటారు.

1961లో జరిగి భారత-చైనా యుద్ధంలో కాశ్మీరు ఈశాన్యభాగమైన ఆక్సాయ్ చిన్ భాగాన్ని చైనా ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన.

అప్పటినుండి భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య వైరానికి కాశ్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్‌లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా జరిగింది). మరల 1999లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది.

కాని కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా వివాదాస్పద ప్రాంతం అనిగాని, పాకిస్తాన్‌లో భాగం అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది.[3]

1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాశ్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాశ్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి.[4]. కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అధ్యక్షుడు గడాఫీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు. (ఈనాడు25.9.2009).

గిల్గిత్ - బాల్టిస్థాన్

కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది.ఇప్పటివరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది.ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది.అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ తప్పు పట్టింది.పాకిస్థాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. for the full historical debate see Alexander Evans's ‘A departure from history: Kashmiri Pandits, 1990-2001’ Contemporary South Asia, Vol 11, 1 2002 p19-37)
  2. CIA publication
  3. ban on the import of Encyclopædia Britannica CD-ROMs into India in 1998
  4. Human Rights Watch report India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished),

http://news.bbc.co.uk/1/hi/world/south_asia/5030514.stm

జమ్మూ కాశ్మీర్ లో హిందూ మతస్తులని, ఉగ్ర వాదులు చంపుతున్నారు, గతంలో చాల మందిని 10,00,000 హిందూ మతస్తులని చంపినారు, ఉగ్ర వాదులుగా మారక పోతే ముస్లిం మతస్తులని కుడా చంపుతున్నారు . ముస్లిం మహిళలని రక్షణ లేదు.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.