చెయ్యేరు

చెయ్యేరు పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది. చెయ్యేరు నది కడప, చిత్తూరు జిల్లాల గుండా ప్రవహించుచున్నది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది.

పేరు వృత్తాంతము

ఈ నదికి చెయ్యేరు లేక బాహుద అనే పేర్లు రావడానికి వెనుకనున్న కథ ఇది: శంఖ-లిఖితులనే అన్నదమ్ములుద్దరు ఏటికి ఈ ఒడ్డున ఒకరు, ఆ ఒడ్డున ఒకరు కాపురముండేవారు.తమ్ముడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేదము, శాస్త్రము నేర్చుకుని వెళ్ళేవాడు. ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉంది. ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేసింది. తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. తర్వాత ఈ విషయం అన్నకు చెప్పాడు. చేసింది నేరమని, రాజు రవివర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోరుకొమ్మనాడు అన్న శంఖుడు. పొత్తపి రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. లిఖితుడు తెగిన చేతులతో అన్న దగ్గరకు వచ్చాడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఏట్లో ముంచమన్నాడు. లిఖితుడు అలాగే చేయగా అతనికి చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి 'చెయ్యేరు' అని పేరు వచ్చింది. సంస్కృతంలో 'బాహు' అంటే చెయ్యి. 'ద' అంటే ఇచ్చునది. అందుకే చేతిని ఇచ్చిన ఈ నది పేరు బాహుద అయింది. ఈ నదిని గురించి తొలితెలుగు యాత్రాచరిత్ర ఐన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. 1830లో ఈ ప్రాంతమీదుగా కాశీయాత్ర చేసిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఈ నదిని గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి వ్రాసుకున్నారు. ఆయన తన గ్రంథంలో నది గడియ దూరము వెడల్పు ఉందని వ్రాశారు. దాన్ని బట్టి ఆ నదిని దాటేందుకు గడియ సేపు పట్టేదని, అంత వెడల్పు అని అర్థంచేసుకోవచ్చు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నాయని, పుణ్యక్షేత్రం నెలకొందని పేర్కొన్నారు.[1]

ఉపనదులు

చెయ్యేరు యొక్క ఉపనదులు

  • బాహుదా
  • ఫించా
  • మండలి
  • పుల్లంగి
  • గుంజన

అన్నమయ్య ప్రాజెక్టు

చెయ్యేరు నది మీద వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలములోని బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు వలన వైఎస్ఆర్ జిల్లాలోని 22,500 ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది. ఈ ప్రాజెక్టు 2.17469 టి.ఎం.సిల నీటిని ఉపయోగించుకొంటుంది. జలాశయము యొక్క నీటి నిల్వసామర్ధ్యం 2.33948 టి.ఎం.సి (గ్రోస్) మరియు 2.23948 టి.ఎం.సి (నెట్).

తొలి అంచనా ప్రకారము ఈ ప్రాజెక్టు యొక్క వ్యయము 60.44 కోట్ల రూపాయలుగా 1996-97 లో నిర్ణయించడమైనది కానీ 2001-02 లో తిరిగివేసిన అంచనాలో ఇంప్రూవ్‌మెంట్లు మరియు ఆధునీకరణ ఖర్చులతో మొత్తము వ్యయము 68.92 కోట్ల రూపాయలుగా వెలకట్టబడింది. 2004 జనవరి వరకు 57.347 కోట్ల రూపాయల మొత్తము ప్రాజెక్టు యొక్క ఆధునీకరణ, పునరావాసము మరియు వైఎస్ఆర్ జిల్లా లోని రాజంపేట, పుల్లంపేట మండలాలలో 22,500 ఎకరాల ఆయకట్టు స్థిరపరచడానికి ఖర్చు చేయబడింది.

మూలములు

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.