గుండ్లకమ్మ

గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది మరియు పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది.

2,900 అడుగుల ఎత్తున ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ వేగం పుంజుకొని రాచర్ల మండలం, జె. పుల్లలచెరువు గ్రామం సమీపాన నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరుస్తుంది[1]

ఇది కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండల లోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల ఎత్తులో పుడుతుంది. కొండలనుండి కిందకు దిగి పల్లపు ప్రాంతానికి రాగానే ఇది కంభం చెరువును, మార్కాపురం చెరువును యేర్పరచుతుంది. ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలము, ఉలిచి గ్రామము వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

కంభం మండలం, తురిమెళ్ళ గ్రామం వద్ద గుండ్లకమ్మ

చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు మరియు చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు. ఈనది మొత్తం పొడవు 220 కిలోమీటర్లు.

గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని మల్లవరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టును 165.22 కోట్ల ఖర్చుతో నిర్మాణము చేపట్టడానికి ఆమోదము తెలియజేసినది. ఈ ప్రాజెక్టు 6 మండలాల పరిధిలోని 43 గ్రామాలలో 80,060 ఎకరాల భూమికి సాగునీటిని అందివ్వగలదని ఆశిస్తున్నారు. అంతేకాక జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో సహా 23.56 లక్షల మంది ప్రజలకు మంచినీటిని సమకూర్చుతుందని ఆశిస్తున్నారు. 2008లో దీని నిర్మాణం పూర్తయ్యింది. 3.875 టీఎంసీల సామర్థ్యం గల కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.9 కిలోమీటర్ల పొడవునా 50 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.3 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం

అభివృద్ధి కోసం 12 గ్రామాలు ముంపుకు గురవుతుండగా నాలుగు గ్రామాలకు పునరావాసం కల్పించారు. ఈ పునరావస కల్పనలో అవకతవకలు కారణంగా చాలా మంది నిర్వాసితులై జీవనశైలి దెబ్బతిన్నది. [2]

పేరు వెనుక కథ

ఆంధ్రప్రదేశ్లో బౌద్ధక్షేత్రాలైన చందవరం, దూపాడు, చేజెర్ల, గ్రంథసిరి, కనుపర్తి, ఉప్పుగుండూరు మరియు మోటుపల్లిలను అనుసంధానిస్తూ గుండ్లకమ్మ నది ప్రధాన జల రహదారిగా పనిచేసింది

మార్కండేయడు రచించిన గజారణ్య సంహిత ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనేచోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. ఆ గుండికానదే వాడుకలో "గుండ్లకమ్మ"గా రూపాంతరం చెందింది. గుండికా నదీగా పిలవబడిన ఈ నదీ తీరంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట.

మూలాలు

  1. Imperial gazetteer of India provincial series, Volume 17 పేజీ.171
  2. k, koteswara rao. "Developmental Rhetoric, Uprooted Lives: Gundlakamma Reservoir Project".
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.