గీతా ప్రెస్

గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత.

గీతా ప్రెస్

స్థాపన

జయదయాళ్ గోయంద్కా అనే ఓ మార్వాడీ వ్యాపారి తాను నిర్వహించే గీతా సత్సంగాలకు ఉపయోగపడేలా టీకా తాత్పర్య సహితంగా భగవద్గీతను అచ్చు వేయాలనుకోవటంతో – 1923లో – ప్రారంభమయ్యింది గీతా ప్రెస్ కథ.

ప్రచురించిన గ్రంధాలు

ఫిబ్రవరి 2014 నాటికి ఎనభయ్యేళ్ళకు పైగా రంగంలో ఉన్న గీతా ప్రెస్ వారి అమ్మకాల గణాంకాలిలా ఉన్నాయి: రామ్‌చరిత్‌మానస్ – 7 కోట్లు; ఉపనిషద్పురాణాదులు – 19 లక్షలు; హిందూ మహిళలకూ, బాలలకూ నీతి గరపేందుకు ఉద్దేశించిన చిన్న పుస్తకాలు – తొమ్మిదిన్నర కోట్లకి కొంచెం తక్కువ; భారతీయ చరిత్రా-పురాణాల నుంచి సంకలించిన కథలూ, ఆధ్యాత్మిక గీతాలు వంటి తతిమ్మా పుస్తకాలు – ఆరున్నర కోట్లు. (ఇంకా అబ్బురపరిచే నంబరు వికీపీడియాలో కనిపించింది – 41 కోట్లు! 2012 నాటికి గీతా ప్రెస్ వాళ్ళు అమ్మిన భగవద్గీత ప్రతుల సంఖ్య అది.

అదనపు సమాచారము

గీతా ప్రెస్‌ని ప్రారంభించిన తరువాత – మరో మూడేళ్ళకు -ఢిల్లీ నగరంలో మార్చి-ఏప్రిల్ నెలల వేసవి ఉడుకులో జరిగిన అఖిల భారతీయ మార్వాడీ అగర్వాల్ మహాసభ ఎనిమిదో వార్షిక సమావేశాలలో సంస్కరణాభిలాషులకూ సంప్రదాయపరులకూ జరిగిన ఒక ఘర్షణ – 1926 ఆగస్టులో – కల్యాణ్ పత్రిక ఆవిర్భావానికి దారి తీసింది.గోయంద్కా మిత్రుడయిన హనుమాన్ ప్రసాద్ పోద్దార్ అనే ఆయన కల్యాణ్ పత్రికకు తొలి సంపాదకుడు. పత్రిక పెట్టిన నాటి నుంచి 1971లో మరణించేదాకా నలభయ్యైదేళ్ళపాటు ఆ బాధ్యత ఆయనదే. పత్రిక నిర్వహణలో, పోద్దార్‌కి గురుతుల్యుడైన గోయంద్కా పాత్ర తక్కువదేమీ కాదు. అయితే, కల్యాణ్ పత్రికకు తీరూ తెన్నూ ఏర్పరచి ప్రభావశీలతను సంతరించిపెట్టిన ఘనత పోద్దార్‌కే దక్కుతుంది.

1870లలో మొదలై 1920ల దాకా కొనసాగిన మూడు ముఖ్యమైన చారిత్రిక పరిణామాలలో, గీతా ప్రెస్-కల్యాణ్ పత్రికల ఆవిర్భావ వికాసాలకు పలు సంఘటనలు చాలా తోడ్పడ్డాయి.ఆ కాలంలో – సరి కొత్త వ్యాకరణాన్నీ, వాక్య నిర్మాణ పద్ధతినీ, సౌందర్యాన్నీ, ఔన్నత్యాన్నీ సంతరించుకొని హిందీ సారస్వత భాషగా నిలదొక్కుకుంది. మహావీర్ ప్రసాద్ ద్వివేది సంపాదకత్వంలో సరస్వతి మాస పత్రిక (హిందీలో తొలి పత్రిక) హిందీ పత్రికల సత్తా ఏమిటో రుజువు చేసాడు. ఉత్తర భారతదేశంలో – బెనారస్, అలహాబాద్ నగరాలలో, ముఖ్యంగా ఒక రచయితల తరం పుట్టుకు వచ్చింది. భాషకి మతాన్ని ఆపాదిస్తూ హిందీ -ఉర్దూలను హిందూ-ముస్లిం భాషలుగా చూడటం మొదలయ్యింది. మార్వాడీలు వ్యాపార రంగంలో నిలదొక్కుకొన్నాక, కొత్త గుర్తింపు కోసం ఆరాటపడటం, హిందూ-ముస్లిం మత విభేదాలు రగులుకుంటున్న రాజకీయ సందర్భం ఇలా పలు సామాజిక, రాజకీయ సంఘటనలు గీతా ప్రెస్-కల్యాణ్ పత్రిక ఆవిర్భావ వికాసాలకు తోడ్పడ్డాయని పలువురి అభిప్రాయములు.


మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.