కె.ఎల్.రావు

డా. కానూరి లక్ష్మణరావు (జూన్ 6, 1902 - మే 18, 1986) ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. పదవీ విరమణ చేసాక కేంద్రములో నెహ్రూ మంత్రివర్గములో నీటిపారుదల శాఖా మంత్రిగా కూడా పనిచేసాడు. 1972లో గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించినది ఈయనే.

నాగార్జునసాగర్ వద్ద కె.ఎల్.రావు విగ్రహం.

లక్ష్మణరావు 1902, జూన్ 6కృష్ణా జిల్లా విజయవాడ సమీపమున ఉన్న కంకిపాడు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి గ్రామ కరణము. బాల్యము నుండే ఈయన ప్రతిభావంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకొన్నాడు. సుప్రసిద్ధ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వీరి బావ.

మద్రాసు విశ్వవిద్యాలయములో ఇంజనీరింగు (బీ.ఈ) డిగ్రీ పూర్తి చేసి, గిండీ ఇంజనీరింగు కళాశాల నుంచి ఇంజనీరింగులో పోస్టుగ్రాడ్యుయేట్ చేశాడు. ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ (ఎం.ఎస్.సి ఇన్ ఇంజనీరింగ్) పొందిన తొలి వ్యక్తి ఈయనే. కొన్ని రోజులు రంగూన్‌లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత ఇంగ్లండు లోని బర్మింగ్‌హాం యూనివర్శిటీ నుండి డాక్టరేట్ ను పొందాడు. ఈయన ఇంగ్లండులో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేశాడు. ఆ కాలములో స్ట్రక్చరల్ ఇంజనీరింగు మరియు రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటు అను పుస్తకము రచించాడు.

1946లో భారత దేశము తిరిగివచ్చి మద్రాసు ప్రభుత్వములో డిజైన్ ఇంజనీరుగా పనిచేశాడు. 1950 లో ఢిల్లీలో విద్యుత్ కమిషనులో డైరెక్టరు (డిజైన్స్) పదవిని నిర్వహించాడు. 1954లో చీఫ్ ఇంజనీరుగా ఉన్నతి పొందాడు. ఈయన కేంద్ర వేర్‌హౌసింగ్ కార్పోరేషన్ లో సభ్యుడు. 1957లో పదవీ విరమణ పొందినా 1962 వరకు సభ్యునిగా కొనసాగాడు.

1962 నుండి 1977 వరకు మూడు పర్యాయములు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనాడు. ఈయన నెహ్రూ, లాల్‌ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీల మంత్రివర్గములలో పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల మరియు విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగా పనిచేశాడు. అనేక భారి ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉంది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలములో అనేక జలవిద్యుచ్ఛక్తి మరియు నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశాడు. ప్రపంచములోనే అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జునసాగర్ ఈయన రూపకల్పన చేసినదే. మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికా కాలములలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం మరియు తుంగభద్ర ప్రాజెక్టు లకు రూపకల్పన చేశాడు.

ఈయన స్మృత్యర్ధము పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణము చేయబడింది. ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమము.

కె.ఎల్.రావు ప్రతిపాదనలు

  • నదులపై భారీ డ్యాములకు బదులు బ్యారేజీలు మినీ రిజర్వాయర్ లు విస్తృతంగా కట్టాలి
  • నదుల కరకట్టలనే నాలుగు లైన్ల రహదారులుగా మార్చాలి

పురస్కారాలు

  • 1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరవ పట్టాను ప్రదానం చేసింది.
  • 1963లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.
  • ఇంజనీరుగా చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా మూడు పర్యాయాలు రాష్ట్రపతి పురస్కారం లభించింది.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.