కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు

సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు (ఆగస్టు 7, 1947 - సెప్టెంబర్ 16, 2012) ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన సుమారు 200 [1] చిత్రాలలో నటించాడు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు.

సుత్తివేలు

జన్మ నామంకురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు
జననం (1947-08-07) 1947 ఆగస్టు 7
భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా
మరణం2012 సెప్టెంబరు 16 (2012-09-16)(వయసు 65)
మద్రాసు, భారతదేశం
భార్య/భర్తలక్ష్మీ రాజ్యం
ప్రముఖ పాత్రలునాలుగు స్తంభాలాట (1982)
వందేమాతరం (1985)
ప్రతిఘటన(1988)

నేపధ్యము

సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవాడు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు.ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రితో చీవాట్లు తిన్నాడు.

నట ప్రస్థానం

ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నాడు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు.

1981లో విశాఖ డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చాడు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చాడు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించాడు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందాడు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈయన తన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నాడు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయాడు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. ఆనందోబ్రహ్మ, మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు ఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చాడు.

వ్యక్తిగత జీవితము

సుత్తివేలు వివాహము లక్ష్మీ రాజ్యంతో జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము.

ఆయనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే అభిమానం.[2]

నటించిన చిత్రాలు

మరణం

అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16మద్రాసు లోని ఒక ఆసుపత్రిలో మరణించాడు[1][3][4].

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.